నేషనల్ హెరాల్డ్ కేసు: సీనియర్ కాంగ్రెస్ నేతలపై ఈడీ కేసు నమోదు
హర్యానా: వరుస కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు ఈడీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి చిదంబరంను సీబీఐ అరెస్టు చేసి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈడీ కూడా విచారణ చేయాలని భావిస్తోంది. ఇక తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్, కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, భూపేందర్ సింగ్ హూడాలను విచారణ చేయాలంటూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ చెబుతోంది.
పంచకులలోని ప్లాట్ నెం సీ-17 , సెక్టార్ 6ను స్వాధీనం చేసుకోవడంలో ఏజేఎల్, మోతీలాల్ ఓరా, భూపేందర్ సింగ్ హూడాలు కీలక పాత్ర పోషించారని ఈడీ చెబుతోంది. ఇందులో మనీలాండరింగ్కు పాల్పడ్డారని తెలుస్తోందని వారిని విచారణ చేసేందుకు అనుమతి కోరింది. అంతకుముందు ఈడీ పంచకుల లోని ప్లాట్ నెంబర్ సీ-17 సెక్టార్ 6ను అటాచ్ చేస్తూ ఇందులో మనీలాండరింగ్ జరిగినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని కోర్టుకు వివరించింది. 1982లో అటాచ్ చేయబడిన ఈ ఆస్తులు ఏజేఎల్కు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత పదేళ్లకు హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తిరిగి స్వాధీనం చేసుకుంది. సరైన నిబంధనలు లేనికారణంగా ఏజేఎల్ నుంచి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపింది.
ఇక అప్పటి సీఎం భూపేందర్ సింగ్ హూడా తిరిగి ఆ ఆస్తులను ఏజేఎల్కు అప్పగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ వెల్లడించింది. అదికూడా అసలైన ధరకే ఏజేఎల్కు కట్టబెట్టారని, ఈ క్రమంలోనే పలు నిబంధనలను ఉల్లంఘించారని తెలుస్తోంది. హూడా అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ వారిని బేఖాతారు చేస్తూ ఏఎల్జేకు ప్లాట్ను అప్పగించారు. ఇలా అప్పనంగా అప్పగించడం ద్వారా హుడాకు నష్టం వాటిల్లి తప్పుడు పద్దతుల్లో ఏఎల్జేకు లాభం చేకూర్చారు. అంతేకాదు అదే ప్లాట్లో వారికి కావాల్సిన భవనాల నిర్మాణాలకు కూడా అనుమతులు ఇచ్చారు.