నేషనల్ హెరాల్డ్ కేసు: వ్యూహం మార్చిన సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో అనుసరించాల్సిన తీరుపై కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చింది. ఈ కేసును రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సోనియా, రాహుల్ గాంధీలు వ్యూహం పన్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే పాటియాలా కోర్టు అదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని తోలుత భావించినా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంలో భాగంగానే ఈ కేసును ఎగదోస్తుందని మంగళవారం సోనియా, రాహుల్ గాంధీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాలని భావిస్తున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లకుండా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కేందుకు వారు సిద్ధపడినట్టు సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రత్యేక కథనంలో పేర్కొంది.
Read More: నేషనల్ హెరాల్డ్ కేసు: అసలేంటీ ఈ గొడవ?
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 19వ తేదీన సోనియా, రాహుల్లు హాజరు కావాల్సిందేనంటూ పాటియాలా కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సోనియా, రాహుల్ కోరగా అందుకు కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2012లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు నేషనల్ హెరాల్డ్కు ఇచ్చిన వడ్డీరహిత రుణం రూ. 90.25 కోట్లను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్)కు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందని హైకోర్టు న్యాయమూర్తి సునీల్ గౌర్ ప్రశ్నించారు.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబే, శ్యాం పిట్రోడా, యంగ్ ఇండియా లిమిటెడ్కు కింది కోర్టు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే నేషనల్ హెరాల్డ్ కేసు రగడ గురువారం కూడా పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది.
ఈ కేసుకు సంబంధించి లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్గాంధీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఎన్డీఏ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండిపడుతున్నారు.