నేషనర్ హెరాల్డ్: సోనియా, రాహుల్... జైలుకా? ఇంటికా?
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్కు సంబంధించి నిధులను దుర్వినియోగం కేసులో శనివారం ఢిల్లీ కోర్టుకు హాజరుకానున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు పోలీసు అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తే, బెయిలుకు దరఖాస్తు చేయరాదని నిర్ణయించుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ కేసును మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు కోసం వాడుకుంటోందని ఇప్పటికే వీరిద్దరూ ఆరోపించారు. ఈ శనివారం మధ్యాహ్నాం కోర్టుకు హాజరవుతుండగా తిరిగి ఇంటికి వస్తారా? లేదా జైలుకు వెళతారా? అన్న విషయమై కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసులో ఏన్డీఏ ప్రభుత్వం విధి విధానాలను ఎండగట్టే దిశగా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని సోనియా, రాహుల్ పార్టీ వర్గాలతో అన్నట్టు సమాచారం. అంతేకాదు అలా జైలుకి వెళ్లి ప్రజల సానుభూతిని మరింతగా కొట్టేయాలనే భావనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
కోర్టుకు వెళ్లే విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రనదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. జ్యూడిషియల్ ప్రాసెస్పై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ఉపాధ్యక్షుడు లాయర్ల ఏం చెప్తే అదే చేస్తారని పేర్కొన్నారు.
ఢిల్లీ కోర్టులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించనున్నారు. సోనియా, రాహుల్లు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారా అన్న ప్రశ్నకు అభిషేక్ సింఘ్వీ ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.
ఇది ఇలా ఉంటే, ఈ కేసులో మరో రెండు రాష్ట్రాలు విచారణలో భాగం పంచుకోనున్నాయి. తాజాగా, ఏజేఎల్ (అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్)కు గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో ఇచ్చిన ఆస్తులను వాణిజ్య అవసరాలకు వాడుతున్నారన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ ప్రారంభించాయి.
ముంబైలో కాంగ్రెస్ భవన్ పేరిట ఉన్న 11 అంతస్తుల భవనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. ఇక భోపాల్లో నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణకు అప్పగించిన ఎకరం భూమిలో ఇప్పుడు ఓ భారీ మాల్ ఉంది. దీనిపైనా విచారణ మొదలైంది.