సరిహద్దుల్లో జాతీయ రహదారులు మూసివేత.. ఆధీనంలోకి తీసుకున్న సైన్యం..
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితల నేపథ్యంలో మనదేశ సైనికాధికారులు మరో కీలక అడుగు వేశారు. సరిహద్దులకు వెంబడి ఉన్న జాతీయ రహదారులను మూసివేశారు. వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సాధారణ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యవసర పరిస్థితుల్లో జమ్మూకాశ్మీర్ కు ఆర్మీ వాహనాలను తరలించడానికి వీలుగా సైనికాధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
పంజాబ్ రాష్ట్ర పరిధిలోని పఠాన్ కోట్ నుంచి జమ్మూకు వెళ్లే జాతీయ రహదారిని తొలుత మూసివేశారు. పఠాన్ కోట్ లో భారత వైమానిక దళానికి అత్యంత కీలకమైన ఎయిర్ బేస్ ఉంది. యుద్ధం అనివార్యమైన పరిస్థితుల్లో పఠాన్ కోట్ నుంచి వాహనాలను జమ్మూకు తరలించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తచర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు సైన్యాధికారులు. పఠాన్ కోట్-జమ్మూ జాతీయ రహదారిపై పంజాబ్ రాష్ట్ర పోలీసులకు చెందిన కొన్ని చెక్ పోస్టులను కూడా ఆర్మీ జవాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులకు బదులుగా జవాన్లను మోహరింపజేశారు.
పఠాన్ కోట్ నుంచి జమ్మూ సుమారు 108 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు గంటలకు పైగా ప్రయాణ సమయం. ఇకపై ఈ మార్గం మొత్తం సైన్యం ఆధీనంలోనే ఉంటుంది. ఎన్నాళ్లు ఉంటుందనే తెలియరాలేదు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ జాతీయ రహదారి ఆర్మీ జవాన్ల పర్యవేక్షణలో ఉంటుంది. ఆర్మీ వాహనాలను తప్ప సాధారణ పౌర వాహనాల రాకపోకలను అనుమతించరు. పంజాబ్ లోని పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో రాష్ట్ర పోలీసుల స్థానంలో ఆర్మీ జవాన్లు మోహరించారు.