కేసీఆర్ కు స్పందించే సమయం లేదా: హోంమంత్రి.. అవేం వ్యాఖ్యలు: ఏకిపారేసిన జాతీయ మీడియా..!
మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన వెటర్నరీ డాక్టర్ అత్యాచారం..హత్య ఉదంతంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఒక వెటర్నరీ డాక్టర్ శంషాబాద్ లిమిట్స్ లో నలుగురు మనిషి రూపంలో ఉన్న రాక్షసుల చేతుల్లో బలయ్యారు. దీని పైన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..జాతీయ స్థాయిలోనూ నిరసనలు..చర్చ జరిగింది. తెలంగాణ గవర్నర్.. కేంద్ర మంత్రి కిష్ రెడ్డి..జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు వచ్చి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఓదార్పు ఇచ్చారు. ధైర్యం చెప్పారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండి మాత్రం ఖండన సైతం రాకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సమయంలో హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు ఈ అంశాలనే జాతీయ మీడియా ఫోకస్ చేస్తోంది. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని నిలదీస్తోంది.
ముఖ్యమంత్రికి స్పందించే టైం లేదా..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెటర్నరీ డాక్టర్ పైన అమానుషంగా అత్యాచారం..హత్య చేసిన ఘటన పైన దేశ వ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తున్నారు. జరిగిన ఘటనను ఖండిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై..కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి సైతం బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అదే విధంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యులు సైతం పరామర్శించారు. ఇక, పార్టీ లకు అతీతంగా పలువురు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్ర ఈ అంశం మీద స్పందంచలేదు. ఘటనను ఖండించ లేదు. బాధిత కుటుంబ సభ్యులను కనీసం ఫోన్ లో కూడా పరామర్శించకపోవటం పైన చర్చ సాగుతోంది. మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారాన్ని తాను పోలీసు అధికారులతో విచారణ తీరుపైన మానిటర్ చేస్తున్నానని ట్వీట్ చేసారు. అయితే, సీఎం కేసీఆర్ స్పందించకపోవటం పైనే ఇప్పుడు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
హోం మంత్రి వ్యాఖ్యలపైన అభ్యంతరం..
వెటర్నరీ డాక్టర్ పైన అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సాధారణ ప్రజానీకం రోడ్డు మీదకు వచ్చారు. చివరకు నిందితుల కుటుంబ సభ్యులు సైతం నేరం చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన హోం మంత్రి బాధితురాలు 100కి ఫోన్ చేయకుండా..చెల్లెలికి ఫోన్ చేయటం పైన చేసిన వ్యాఖ్యలు బాధితు కుటుంబ సభ్యులతో పాటుగా..వారికి అండగా నిలిచిన వారికి ఆగ్రహం తెప్పించాయి. మరో మంత్రి ఇంటికో పోలీసును ఏర్పాటు చేయలేమంటూ చేసిన కామెంట్స్ సైతం ఆగ్రహానికి కారణమయ్యాయి. మహిళా మంత్రులిద్దరూ వచ్చి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కానీ, సీఎం స్పందించకపోవటం పైనా జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. దీని పైన అధికార పార్టీకి చెందిన నేతలను జాతీయ విశ్లేషకుల ముందు ఛానళ్ల ప్రతినిధులు నిలదీస్తున్నారు.
నేషనల్ మీడియాకు నెటిజెన్ల మద్దతు
తాజాగా ఇదే అంశం పైన జాతీయ స్థాయిలో ఒక ఛానల్ లో చర్చ జరిగింది. తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఎంపీ సైతం చర్చలో ఉన్నారు. చర్చ నిర్వహకులు సీఎం కేసీఆర్ వైఖరిని నిలదీసారు. బాధితురాలి కుటుంబానికి పరామర్శ చేయటం..ఘటన పైన స్పందించటం..వంటివి ఎందుకు చేయలేదని నిలదీసారు. దీని పైన అధికార పార్టీ ఎంపీ వివరణ ఇచ్చుకొనే ప్రయత్నం చేసినా..చర్చలో వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్న పలు సంఘాల నేతలు సైతం అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇద సమయంలో ఆ ఛానల్ కు వచ్చిన కామెంట్లు..సోషల్ మీడియాలో ఆ చర్చ వేదిగా నెటిజెన్లు చర్చ నిర్వహకులకు మద్దతుగా పోస్టింగ్ లు పెట్టారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి..ఆ ఛానల్ నిర్వహకులు అసలు సీఎం ఏం చేస్తున్నారు..అసలు తెలంగాణలోనే ఉన్నారా..అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ చర్చ జరిగిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.