మళ్లీ ఎన్పీఆర్ తేనెతుట్టెను కదుపుతున్న కేంద్రం- బీహార్ పోల్స్ ముగియడంతో...
వివాదాస్పద జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)పై గతంలో అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం గతంలో దాన్ని పక్కనబెట్టింది. గతేడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విమర్శలు రాకుండా ఈ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా దీని ప్రశ్నావళి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లో దేశవ్యాప్తంగా ప్రజల వివరాలు చేర్చేందుకు వీలుగా వారికి కొన్ని ప్రశ్నలు తయారు చేశారు. వీటిలో కుల, మత, వర్గాలకు సంబంధించిన కొన్ని అంశాలున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దేశంలోని పలురాష్ట్రాల్లో నిరసనలు కూడా చోటు చేసుకోవడంతో కేంద్రం దీనిపై వెనక్కితగ్గింది. అదే సమయంలో కరోనా విజృంభణతో ఈ ప్రక్రియ నిరవధికంగా వాయిదా పడింది.
ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలతో పాటు బీహార్ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడం, కరోనా ప్రభావం కూడా తగ్గడంతో కేంద్రం ఎన్పీఆర్పై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రశ్నావళి సిద్ధమవుతోందని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సమాధానమిచ్చారు.
Recommended Video
జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) తయారీలో ఎన్పీఆర్ కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 13 ఎన్డీయేతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీన్ని అమలు చేసేందుకు నిరాకరిస్తున్నాయి. ఎన్పీఆర్లో తల్లితండ్రుల జన్మస్ధలం, తేదీ వంటి ప్రశ్నలు అడగటంతో దీనిపై అనుమానాలు ముసురుకున్నాయి. ఎన్పీఆర్ ద్వారా సేకరించిన వివరాలతో ఎన్సార్సీని అమలు చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా దీన్ని పలు రాష్ట్రాలు అభివర్ణిస్తున్నాయి. దీంతో ఎన్పీఆర్ అమలుకు తాజా ప్రశ్నావళి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.