గ్రామీణ పేదరికంలో ఆందోళనకర పెరుగుదల: ఆ మూడు రాష్ట్రాల్లో దుర్భరం..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో గ్రామీణ పేదరికంలో ఆందోళనకరంగా పెరుగుదల చోటు చేసుకుంది. గ్రామీణ పేదల పరిస్థితి దిగజారింది. ఇదివరకు ఉన్నప్పటి పరిస్థితుల కంటే దుర్భరంగా ఉన్నట్లు తేలింది. జాతీయ గణాంకాల కార్యాలయం (నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్) తాజాగా వెల్లడించిన నివేదిక.. ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొని ఉన్నాయని వెల్లడించింది. ప్రత్యేకించి- మూడు రాష్ట్రాల్లో గ్రామీణ పేదలు దుర్భర స్థితిగతుల మధ్య జీవిస్తున్నారని పేర్కొంది.
Disha Murder case: శాడిజం: దిశ అత్యాచారం, హత్యపై అశ్లీలకర పోస్టింగులు..యువకుడి అరెస్టు..!
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అందుతోన్న విద్య, వైద్యం, నివాసం, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతోన్న లబ్ది, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ గణాంకాల సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ఆయా అంశాల్లో బిహార్, జార్ఖండ్, ఒడిశాల్లో గ్రామీణ పేదరికంలో గణనీయంగా పెరుగుదల నమోదైంది. బిహార్ లో 2011-12, 2017-18 మధ్యకాలంలో ఏకంగా గ్రామీణ పేదరికంలో 17 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.
జార్ఖండ్ లో 8.6, ఒడిశాలో 8.1 శాతం మేర పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా నమోదు కావడం ఆందోళనకరమని చెబుతున్నారు. బిహార్ మినహా జార్ఖండ్, ఒడిశాలకు చెందిన సుమారు 40 శాతం మేర ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు తేలింది. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు విప్లవాత్మక పథకాలను ప్రవేశ పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది.
కాగా- పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడుల్లో గ్రామీణ పేదరిక పరిస్థితులు చెప్పుకోదగ్గ విధంగా మెరుగు పడ్డాయని జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొంది. పశ్చిమ బెంగాల్-6, గుజరాత్-5, తమిళనాడు-5 శాతం పాయింట్ల మేర క్షీణత కనిపించిందని వెల్లడించింది. మహారాష్ట్ర సైతం ఇదే తరహా మెరుగైన రికార్డును ప్రదర్శించిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ఇదివరకే ఏర్పాటైన టెండుల్కర్ కమిటీ, రంగరాజన్ కమిటీలు అందజేసిన సిఫారసులను అమలు చేయాల్సి ఉందని నివేదిక అభిప్రాయ పడింది.