మహిళను అడ్డం పెట్టుకుని..! రాహుల్ వ్యాఖ్యలపై దుమారం.. నోటీసులు
Recommended Video
ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెడకు మరో వివాదం చుట్టుకుంది. ప్రధాని మోడీ.. మహిళను అడ్డం పెట్టుకుని రక్షించుకుంటున్నారన్న రాహుల్ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఈమేరకు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. రఫేల్ ఒప్పందంపై పార్లమెంటులో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ మోడీపై సెటైర్లు వేశారు రాహుల్. మోడీ తనను కాపాడుకోవటానికి మహిళను అడ్డం పెట్టుకున్నారని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. ఈమేరకు ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
56 ఇంచులతో ఛాతీ కలిగిన వాచ్ మెన్ పారిపోయి మహిళకు ఈ విధంగా చెప్పాడు. సీతారామన్ జీ, నన్ను కాపాడంటూ వేడుకున్నాడు, నన్ను నేనుగా రక్షించుకోలేకపోతున్నానంటూ వాపోయాడు. అలా అడిగిన ఆ వాచ్ మెన్ ను రెండున్నర గంటల పాటు ఆమె రక్షించలేకపోయారు. ఆ సమయంలో నేను సూటిగా ఓ ప్రశ్న వేశాను. అవును, కాదు ఏదో ఒక సమాధానం చెప్పమన్నాను. కానీ ఆమె చెప్పలేకపోయారు. ఇదంతా ఓ ర్యాలీ సందర్భంగా రాహుల్ మాట్లాడిన తీరు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారడంతో దుమారం మొదలైంది. ఆయన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తప్పుపట్టింది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదని కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ అభిప్రాయపడ్డారు. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. తన వ్యాఖ్యలపై రాహుల్ వివరణ ఇవ్వడమే గాకుండా సీతారామన్ కు క్షమాపణలు చెప్పాలని కోరారు.