‘నేషనలిజమ్.. భారత్ మాతా కీ జై’ నినాదాల దుర్వినియోగం: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: జాతీయవాదం, భారత్ మాతా కీ జై అనే నినాదాలు తప్పుగా ఉపయోగించబడుతున్నాయని, మిలిటెంట్ తరహా భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. జవహర్ లాల్ నెహ్రూ వర్క్స్ అండ్ స్పీచెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామ్య శక్తివంతమైన దేశంగా ఇండియాను గుర్తించాలని తొలి ప్రధాని ఆకాంక్షించారని, అందుకోసం ఆయన కృషి చేశారని చెప్పారు మన్మోహన్. ప్రజాస్వామ్య పద్ధతిలో దేశం నడవాలని జవహర్ లాల్ కోరుకున్నారని, ఆయన అలాగే పాలన కొనసాగించారని తెలిపారు. చారిత్రక, ఆధునిక భారతదేశానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి తొలి ప్రధాని గర్వంగా నిలిచారని వ్యాఖ్యానించారు.
నెహ్రూ కలలు కన్న ఇండియా ఇప్పుడు లేదని మన్మోహన్ అన్నారు. చరిత్రను చదివే ఓపిక లేని కొందరు నెహ్రూను తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అయితే, చరిత్ర ఆ ఆరోపణలను తిప్పికొడుతుందని అన్నారు. జాతీయవాదం, భారత్ మాతాకీ జై అనే నినాదాలు తప్పుగా ఉపయోగించి పౌరుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అన్నారు.
భారతమాత ఎవరు? ఎవరి విజయం మీరు కోరుకుంటున్నారు? అని జవహర్ లాల్ నెహ్రూ ఒకసారి వ్యాఖ్యానించారని చెప్పారు. ఇండియా అంటే పర్వతాలు, నదులు, అడవులు, పొలాలు అందరికీ ప్రియమైనవే.. కానీ ప్రజలనే పరిగణలోకి తీసుకుంటారని ఆయన చెప్పారని తెలిపారు. నిజమైన ప్రజాస్వామ్యానికి, మంచి రాజకీయాలకు నెహ్రూ బాటలు వేశారని చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, మళ్లీ రావాలని అన్నారు.
పండిట్ నెహ్రూ ఐడియా ఆఫ్ ఇండియా, గాంధీ మార్గదర్శకాలు, కులమత భేదాలు లేని సమాజం, లాంటి అంశాలే దేశ బహుళత్వాన్ని నిర్దేశించాయని అన్నారు. సామాన్యులకు సేవ చేయడమే ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్ష్యమని నెహ్రూ పేర్కొన్నారని తెలిపారు. పాఠశాల దశ అనేది చాలా ముఖ్యమైన కాలమని నెహ్రూ చెప్పేవారని గుర్తు చేశారు. ఈ దశలోనే మంచి మార్గాన్ని నిర్దేశించుకుంటే భవిష్యత్ కూడా ఉన్నతంగా ఉంటుందని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.