ఎన్ఆర్సీ అవసరం లేదు: మోడీ క్లారిటీ ఇవ్వాలంటూ నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు
పాట్నా: దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్ర ఎన్ఆర్సీ అమలుపై ఇంకా స్పష్టతనివ్వని నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
నితీష్ మీరు మద్దతిస్తున్నారా...
ఎస్సీ, ఎస్టీలకు మరో పదేళ్లపాటు రిజర్వేషన్లను పొడిగించే తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడంతో సీఎం నితీష్ కుమార్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతకుముందు ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు మద్దతిస్తున్న విషయంపై నితీష్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
సీఏఏకు మాత్రమే.. ఎన్ఆర్సీపై మోడీ స్పష్టత నివ్వాలి..
ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఏఏపై చర్చించేందుకు తాము సిద్ధమని అన్నారు. తాను ఎప్పుడూ ఎన్ఆర్సీకి మద్దతు ఇవ్వలేదని, దాని గురించి తాను స్పందించలేదని అన్నారు. బీహార్లో ఎన్ఆర్సీని అమలు చేయబోమని అన్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి అస్సాంలో ఎన్ఆర్సీ అమలు జరుగుతోందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు అనేది అవసరం లేదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై స్పష్టతనివ్వాలని అన్నారు.
పార్లమెంటులో సీఏబీకు మద్దతు.. వ్యతిరేకించిన ప్రశాంత్ కిషోర్
పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుకు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాము సీఏఏకు మద్దతు ఇచ్చాం కానీ, ఎన్ఆర్సీకి కాదని నితీష్ చెప్పారు. ఎన్ఆర్సీని బీహార్ రాష్ట్రంలో అమలు చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే జేడీయూ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్ఆర్సీతోపాటు సీఏఏను కూడా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీష్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆచితూచి వ్యవహరిస్తున్న నితీష్
ప్రస్తుతం జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీహార్ సీఎం నితీష్ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీఏఏ, ఎన్ఆర్సీలపై నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఎన్ఆర్సీ అమలుపై కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్సీపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత నివ్వాలంటూ నితీష్ కుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.