ముంబాయికి మూకుమ్మడి ఉపద్రవాలు.!ఓ పక్క కుమ్మేస్తున్న కరోనా.!మరోపక్క ప్రకృతి ప్రకోపం..!
ముంబాయి/హైదరాబాద్ : దేశ ఆర్దిక రాజధానిని సమస్యలు కుదిపేస్తున్నాయి. కంటికి కనిపించని కరోనా వైరస్ కరతాళ నృత్యం చేస్తుండగానే ముంబాయి నగరం మీద ప్రకృతి ప్రకోపిస్తోంది. వరుసగా సంభవిస్తున్న ఉపద్రవాలతో ముంబాయి మహానగరం చిగురుటాకులా వణికిపోతున్నట్టు తెలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో నమోదవవ్వని కరోనా కేసులు మహారాష్ట్ర లో నమోదు కావడంతో అధికార యంత్రాంగం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సడలించిన ఆంక్షల నేపథ్యంలో కరోనా ఇంకెంత విజృంభిస్తుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. కరోనా అంశం అలా ఉంచితే నిసర్గ తుపాను రూపంలో ముంబాయికి మరో విపత్తు పొంచిఉన్నట్టు తెలుస్తోంది.
కరోనా వెళ్లిపోలేదు.. నిసర్గ తరుముకొస్తోంది..
ముంబాయి మహా నగరానన్ని కష్టాలు ముంచెత్తున్నాయి. ఎవరో కక్షగట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగానే అనేక సమ్యల వలయంలో చిక్కుకుంటోంది ముంబాయి నగరం. అంతే కాకుండా కరోనా మహమ్మారితో చేతబడి చేసినట్టు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. భారతదేశానికి ఏటీఎం వంటి ముంబాయి నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామలు విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులతో ఛిన్నాభిన్నమైన ముంబయి నగరానికి నిసర్గ తుపాను ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుండగంతో గెండె జారి పోతున్నారు ముంబాయి వాసులు.
ముంబాయికి నిసర్గ ముప్పు..
జూన్ మొదటి వారంలో ముంబయికి మహా వరద రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈసారి వారం ముందుగానే భారతదేశంలోకి అడుగుపెడుతున్న రుతుపవనాలు మొదటి వారంలోనే ముంబాయి నగరన్ని పలకరించబోతున్నాయి. కాగా ముంబాయి నగరంలోని అధికార యంత్రాంగం మొత్తం కరోనా నివారణ చర్యల్లో మునిగిపోయింది. తాజాగా తుపాను వల్ల కలిగే వరదల భీభత్సాన్ని అదుపుచేయడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు సవాల్ గా మారాయి. బృహన్ ముంబాయి కార్పోరేషన్లో అధికారులు పరిమిత సంఖ్యలో ఉండడంతో వచ్చే తుపానును ఎలా అధిగమించడం అని అధికారులు తలలు పట్టుకున్నట్టు తెలుస్తోంది.
కరోనా విధుల్లో ఉన్న అధికారులు..
బృహన్ ముంబాయి కార్పోరేషన్ అధికరులంతా కరోనా నివారణ చర్యల్లో నిమగ్నమైన తరుణంలో కొత్తగా వచ్చే తుపాను, వరద నివారణ, రక్షణ ఏర్పాట్లు చేయడంలో ఎంతవరకు అప్రమత్తంగా వ్యవహరిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. సాధారణ రుతుపవనాలు కాకుండా అల్పపీడనం ఏర్పడటం వల్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జూన్ మూడవ తారీఖు నుండి ఆరవ తారీఖు వరకూ అంటే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.
Recommended Video
అయోమయంలో బృహన్ ముంబాయి కార్పోరేషన్ అధికరులు..
జూన్ 15 నాటికి సాధారణంగా మహారాష్ట్ర మొత్తం రుతుపవనాలు విస్తరిస్తాయి. అయితే, ఈసారి కరోనా వల్ల అధికార యంత్రాంగం వరద నివారణ ఏర్పాట్లను అంత చురుగ్గా చేయలేకపోయారు. తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందితోనే అక్కడ కరోనా బారిన పడిన వారికి సేవలందిస్తున్నారు. ముంబై ప్రజలు జాగ్రత్త పడి వరదల్లో చిక్కుకోకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం శ్రేయస్కరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతి చిన్న అంశానికి ప్రభుత్వ సాయం కోసం చూసి నిరాశపడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే మంచిదనే సలహాలు తెరమీదకు వస్తున్నాయి.