మనసున్న మారాజు : బక్రీద్ను ఇలా జరుపుకున్నాడు..నెటిజెన్ల మనసును గెలుచుకున్నాడు
ఎర్నాకుళం: కేరళను వరదలు ముంచెత్తాయి. వరదలు విలయతాండవం చేయడంతో మరోసారి కేరళ కకావికలమైంది. భారీ వర్షాలకు ప్రజలంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. సొంతవారిని పోగొట్టుకుని కొందరు విషాదంలో మునిగిఉన్నారు. ఇప్పటికే వరదల ధాటికి చాలామంది మృతి చెందారు. ఇక కేరళ రాష్ట్రంలో ముస్లిం జనాభా బాగానే ఉంది. సోమవారం రోజున బక్రీద్ కావడంతో వారిళ్లల్లో ఎక్కడా పండగ వాతావరణం కనిపించడంలేదు. వారి పండగ కలలను వరదలు తుడిచేశాయి. పండగరోజును పట్టెడు అన్నం కోసం ఎదురు చూస్తున్న వారిని చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అయితే వీరిని ఆదుకునేందుకు చాలా మంది దాతలు తమకు తోచినంతలో విరాళాలు ఇస్తున్నారు. కేరళలోని నౌషద్ కూడా తనకు తోచినంతలో విరాళంగా ఇచ్చి అందరి మనస్సులు గెల్చుకున్నాడు.
కేరళను ముంచెత్తుతున్న వరదలు
కేరళలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళలో ముస్లింల జనాభా కాస్త ఎక్కువే. బక్రీద్ పర్వదినాన కూడా వర్షాలు కేరళను ముంచెత్తడంతో అక్కడి ముస్లింలు పండగనే మరిచే పరిస్థితికి వచ్చారు. రిలీఫ్ క్యాంప్లలో ఉంటూ పట్టెడు అన్నం కోసం ఎదురుచూస్తున్నారు. అదే రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా మటన్చేరికి చెందిన నౌషద్ అనే వ్యక్తి పెద్ద మనసుతో ముందుకొచ్చాడు. స్వతహాగా బట్టల వ్యాపారి అయిన నౌషద్ తన వ్యాపార నిమిత్తం తీసుకొచ్చిన బట్టలన్నీ వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు.
విరాళంగా వస్త్రదుకాణంలోని కొత్త బట్టలు ఇచ్చిన నౌషద్
మలాబార్ ప్రాంతంలో వరదలు బీభత్సం చేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలన్న మంచి ఉద్దేశంతో విరాళాలు సేకరించేందుకు నటుడు రాజేష్ షమా ముందడుగు వేశారు. ఇక రాజేష్ షమా వరద బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నారన్న విషయం తెలుసుకున్న నౌషద్... అతన్ని తన షాపుకు ఆహ్వానించాడు. కొత్త బట్టలన్నీ తీసి విరాళంగా ఇచ్చాడు. అందులో ఎక్కువగా చిన్నపిల్లల బట్టలు, మహిళల వస్త్రాలు ఎక్కువగా ఉన్నాయి. బక్రీద్కు ముందు ఆ బట్టను అమ్మాలని చెప్పి వాటిని దాచి ఉంచాడు నౌషద్. కానీ సహజ విపత్తుతో కేరళ అల్లకల్లోలం అవడం, అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలను తను ఇచ్చే విరాళం కొంతైన ఉపయోగపడుతుందనే మంచి ఉద్దేశంతో నౌషద్ భారీ విరాళాన్ని ఇచ్చారు.
సోషల్ మీడియలో వీడియో పోస్టు చేసిన రాజేష్ షమా
నౌషద్ ఇచ్చిన విరాళాన్ని తెలుపుతూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు నటుడు రాజేష్ షమా. దీంతో ఆ పోస్టు వైరల్గా మారింది. " ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లేటప్పుడు మనతో పాటు ఏమీ తీసుకుపోము. నాకు వచ్చే లాభాలు అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బక్రీద్ పండగ వస్తోంది. ఈ బట్టలన్నీ విరాళంగా ఇచ్చి బక్రీద్ను ఇలా జరుపుకోవడంలో ఆనందం తృప్తి కలిగిస్తోంది" అని నౌషద్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెటిజెన్ల మనసు గెల్చుకున్న నౌషద్
ఇక నౌషద్ విరాళం ఇచ్చి నెటిజెన్ల మనసులను గెలుచుకున్నాడు. కేరళ మంత్రి సుధాకరన్ కూడా నౌషద్ను అభినందించారు. నౌషద్లాంటి సహాయం చేసు గుణం ఉన్నవాళ్లు ఉన్నంతవరకు విఫలం అనేది ఉండదని అన్ని విబేధాలు పక్కనబెట్టి సాటి మనిషికోసం నిస్వార్థంగా పనిచేయడం నిజంగా హర్షించదగ్గ విషయమని మళయాలం స్టార్ ఆసిఫ్ అలీ వ్యాఖ్యానించారు. ఎర్నాకులం జిల్లా కలెక్టర్ సుహాస్ కూడా స్పందించారు. నౌషద్ను ప్రశంసించారు. రెస్క్యూ ఆపరేషన్, రిలీఫ్ వర్క్ అయిపోయాక నౌషద్ను వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు.
ఇదిలా ఉంటే కేరళలో ఇంకా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2.27 లక్షల మంది ప్రజలను షెల్టర్ హోమ్స్కు తరలించిన ప్రభుత్వం 1551 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఇక కేరళ వరదలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం పినరాయి విజయన్... ఆగష్టు 8 నుంచి ఇప్పటి వరకు వరదల ధాటికి 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు.