రంజాన్ అప్పుడే వచ్చా: పాక్ ఉగ్రవాది నవెద్
జమ్మూ: బీఎస్ఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపి ప్రాణాలతో చిక్కిన పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ నవెద్ యాకూబ్ ఒక ప్రశ్నకు అనేక సమాధానాలు చెప్పడంతో పోలీసు అధికారులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
వీరు పక్కా ప్లాన్ తోనే భారత్ లోకి అడుగు పెట్టారని దర్యాప్తు చేస్తున్న అధికారులు అంటున్నారు. అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు మహమ్మద్ నవెద్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. తాను రంజాన్ నెల ప్రారంభం అయిన సమయంలోనే భారత్ లో అడుగు పెట్టానని అన్నాడు.
లష్కర్-ఏ-తోయిబా సంస్థ తనకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చిందని అంగీకరించాడు. తరువాత కాశ్మీర్ లోయలో తలదాచుకున్నామని చెప్పాడు. తరువాత అక్కడి నుండి చిన్నచిన్నగా తాము ముందుకు వచ్చామని వివరించాడు.
ఒక ట్రక్కు ద్వార నవెద్ మరొ ఉగ్రవాది ఉధంపూర్ చేరుకున్నారు. వీరు చెబుతున్నట్లు అమరనాథ యాత్ర భక్తులు టార్గెట్ కాదని, బనిహల్ టన్నెల్ కు దక్షిణ భాగంలోని రహదారి మీద వెళ్లే బీఎస్ఎఫ్ కాన్వాయ్ని లక్ష్యంగాచేసుకున్నారని వెలుగు చూసింది.
అతని చెప్పే సమాధానాలు వింటుంటే వీరు భారీ వ్యూహం రచించారని అధికారులు అంటున్నారు. బుధవారం రాత్రి పూర్తిగా నవెద్ ను విచారణ చేశారు. గురువారం జమ్మూ పోలీసు అధికారులు విచారించారు.
ఢిల్లీ నుండి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉన్నత స్థాయి అధికారులు ఉధంపూర్ చేరుకుని నవెద్ ను విచారణ చెయ్యనున్నారు. నవెద్ ను విచారించి అతని తో పాటు ఇంకా ఎవరైనా భారత్ లోకి వచ్చారా అని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.