ఒడిశాలో మరోసారి శంఖనాదం.. ఐదోసారి సీఎంగా నవీన్ పట్నాయక్
భువనేశ్వర్ : ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. వరుసగా ఐదోసారి పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. 147 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ను క్రాస్ చేసిన ఆ పార్టీ వంద సీట్లు అకౌంట్లో వేసుకునే దిశగా దూసుకుపోతోంది.
బీజేపీకి పెరిగిన బలం
రాష్ట్రంలో పట్నాయక్ ప్రభుత్వానికి పట్టం కట్టిన ఓటర్లు లోక్సభ విషయంలో మాత్రం బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఒడిశాలో 21 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగగా వాటిలో మెజార్టీ స్థానాలను బిజూ జనతాదళ్ సొంతం చేసుకుంది. అయితే 2014తో పోలిస్తే ఈసారి మెజార్టీ తగ్గింది. గతం సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ 20స్థానాలను ఖాతాలో వేసుకోగా... బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటులో గెలిచింది. తాజా ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పార్టీ 12స్థానాలకు పరిమితం కానుండగా.. బీజేపీ బలం భారీగా పుంజుకుంది. ఈసారి ఆపార్టీ 9స్థానాలు గెలుచుకునే ఛాన్సుంది.
ఐదోసారి సీఎంగా పట్నాయక్
ఒడిశా అసెంబ్లీ ఫలితాలు బీజేడీకి అనుకూలంగా రావడంతో నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన సీఎం పదవి చేపట్టడం ఇది ఐదోసారి కావడం విశేషం. 72ఏళ్ల నవీన్ పట్నాయక్ దేశంలో అత్యంత ఎక్కువకాలం పాలించిన సీఎంలలో ఒకరు. ఈసారి ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ తొలిసారి రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. 2000 సంవత్సరం నుంచి వరుసగా విజయం సాధిస్తున్న సౌత్ ఒడిశాలోని హిన్జిలీతో పాటు వెస్ట్ ఒడిశాలోని బీజేపూర్ నుంచి ఆయన బరిలో నిలిచారు.
యూపీఏ, ఎన్డీయేలకు సమాన దూరం
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, 1998లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారు. 2009లో మాత్రం అటు యూపీఏ, ఇటు ఎన్డీయేలతో సమాన దూరం పాటించారు. తాజా ఎన్నికల్లోనూ ఆయన ఇదే విధానం ఫాలో అయ్యారు. అయితే ఒడిశా అభివృద్ధికి సహకరించే కూటమికి తమ మద్దతు ఉంటుందని పట్నాయక్ స్పష్టం చేశారు.
ఒడిశాపైనే పట్నాయక్ దృష్టి
మిగతా రాజకీయ పార్టీల నాయకుల్లాగా జాతీయ రాజకీయాలపై అంతగా ఆసక్తిచూపని నవీన్ బాబు ఒడిశాకే పరిమితమయ్యారు. ఒడిశా మాజీ సీఎం బీజూ పట్నాయక్ కుమారుడైన నవీన్ పట్నాయక్ 1997లో జనతాదళ్ నుంచి బయటకు వచ్చిన బిజూ జనతాదళ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. 1997లో తొలిసారి అస్కా నియోజకవర్గం నుంచి ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన.. 2000 సంవత్సరంలోను అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఒడిశాలో సమర్థ పాలన అందిస్తున్న ఆయన మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.