పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి..ఎందుకో తెలుసా..?
న్యూయార్క్ : రచయిత, ఫిల్మ్ మేకర్ గీతా మెహతా తనను వరించిన పద్మశ్రీ అవార్డును తీసుకునేందుకు తిరస్కరించారు. ఆమె ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి. సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ పద్మశ్రీ పురస్కారం తనకు వద్దంటూ వెల్లడించారు. విద్య సాహిత్య రంగంలో గీతా మెహతా అందించిన సేవలకు గాను ఆమెను పద్మశ్రీతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
"కేంద్ర ప్రభుత్వం తన విద్య సాహిత్య రంగంలో నా కృషిని గుర్తించి నన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఈ సమయంలో ఆ అత్యున్నత పురస్కారాన్ని వద్దనుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల ముందు నాకు వచ్చిన ఈ అవార్డును తిరస్కరిస్తున్నానని చెప్పేందుకు బాధగా ఉంది. ఈ సమయంలో తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నాను. కేంద్రప్రభుత్వంను ఇబ్బంది పెట్టినందుకు క్షమించాల్సిందిగా కోరుతున్నాను" అని చెబుతూ గీతా మెహతా ఒక ప్రకటన విడుదల చేశారు.
తన సోదరి గీతా మెహతా పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించడంపై స్పందించేందుకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ నిరాకరించారు.గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న నవీన్ పట్నాయక్ పద్మపురస్కారాలు వచ్చిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 112 మందికి పద్మపురస్కారాలు ప్రకటించింది. 70వ గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.
ఇదిలా ఉంటే 1989లో రాజ్ అనే పేరుతో పుస్తకం రాశారు గీతామెహతా. స్నేక్స్ అండ్ లాడర్స్ : గ్లింప్సెస్ ఆఫ్ మోడ్రన్ ఇండియా (1997), ఎటర్నల్ గణేషా: ఫ్రమ్ బ్రిటీష్ టూ రీబర్త్ (2006)లాంటి పుస్తకాలు గీతా మెహతా రాశారు. వీటితో పాటు కొన్ని డాక్యుమెంటరీలను నిర్మించి, దర్శకత్వం కూడా వహించారు. అమెరికాలోని ఓ ప్రముఖ టీవీ నెట్వర్క్ ఎన్బీసీకి వార్ కరస్పాండెంట్గా పనిచేశారు. గీతా మెహతా అమెరికాకు చెందిన పబ్లిషర్ సోనీ మెహతాను వివాహం చేసుకున్నారు.