కేసీఆర్ ఫెడరల్ఫ్రంట్కు ఊపిరిపోసే మాటలు చెప్పిన నవీన్ పట్నాయక్ !? నమ్మొచ్చా ..?
ఒడిశా : ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్.. ప్రధాని నరంద్రే మోడీ టార్గెట్గా మాటల తూటాలు పేల్చారు. అసలు వాజ్పేయితో మోడీని పోల్చలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మోడీ మరోసారి ప్రధాని అవుతారనే నమ్మకం లేదన్నారు. వాజ్పేయి సమర్థవంతమైన ప్రధాని అంటూ కొనియాడుతూనే.. మోడీకి చురకలు అంటించారు. పనిలోపనిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆరోపణాస్త్రాలు సంధించారు.
వివాదంలో ఎమ్మెల్యే 'రాజాసింగ్' పాట.. ''హిందుస్తాన్ జిందాబాద్'' ట్యూన్ మాదంటున్న పాక్
వాజ్పేయితో మోడీని పోల్చలేము..!
మోడీ టార్గెట్ గా నవీన్ పట్నాయక్ విసిరిన మాటల బాణం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఓ టీవి ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పట్నాయక్ మోడీపై హాట్ కామెంట్స్ చేశారు. వాజ్పేయితో మోడీని పోల్చలేమని.. ఆయనంత సమర్థవంతంగా మోడీ పనిచేయలేరని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా వాజ్పేయితో తాను పనిచేసినట్లు పట్నాయక్ గుర్తుచేశారు. ఆయన పర్ఫెక్ట్ ప్రధానమంత్రి అంటూ కితాబిచ్చారు.
మరోసారి మోడీ ప్రధానిగా కష్టమే
పాలనలో మోడీ వెనుకబడ్డారని వ్యాఖ్యానించారు పట్నాయక్. చెప్పింది ఏది కూడా చేయలేదని.. హామీల అమలులో చిత్తశుద్ధి లేదన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇరిగేషన్, రైల్వే ప్రాజెక్టుల్లో కూడా ఆశించినంత అభివృద్ధి జరగలేదన్నారు. అందుకే మోడీ మరోసారి ప్రధాని అవుతారనే నమ్మకమైతే తనకు లేదన్నారు. రాహుల్ గాంధీ టార్గెట్గా వ్యంగ్యాస్త్రాలు సంధించిన పట్నాయక్.. ఆయనకు ఇంకా పరిపక్వత రాలేదని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా.. బీజేపీకి సవాల్ విసిరారు పట్నాయక్. ఒడిషాలో సీఎం అభ్యర్థి ఎవరో ఇంతవరకు ప్రకటించకపోవడం ఆ పార్టీ ఫెయిల్యూర్ గా అభివర్ణించారు. బీజేపీ లీడర్ల డబుల్ ఇంజిన్ నినాదం ఒడిషాలో విఫలమైందన్నారు. ఒడిషా సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలో బీజేపీ అగ్రనేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో వాళ్లకే మా సపోర్ట్
ఎన్నికల వేళ బస్సు యాత్ర ద్వారా ఒడిషా వ్యాప్తంగా విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టారు పట్నాయక్. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ పార్టీదే అంతిమ విజయమని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి అధికార పీఠం దక్కించుకుంటామన్నారు. అదలావుంటే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని పక్షంలో.. ఒడిశాను ఆదుకునే పార్టీలకే కేంద్రంలో తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.