ఓఎన్జీసీలో భారీ అగ్ని ప్రమాదం: ఐదుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓఎన్జీసీ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు.
నేవీ ముంబైలోని ఉరాన్ ప్రాంతంలో ఉన్న ఓఎన్జీసీ ప్లాంటులో మంగళవారం ఉదయం 6.45గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకున్న కాసేపటికే మంటలు భారీగా ఎగిసిపడి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. కార్మికులు పనిచేస్తున్న సమయంలోనే ప్రమాదం చోటు చేసుకోవడంతో కొందరు కార్మికులు తప్పించుకోలేకపోయారు.
ఐదుగురు కార్మికులు ఈ ప్రమాదంలో మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు సీఐఎస్ఎఫ్ ఫైర్మెన్ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఉరాన్, పన్వేలు, నెరూల్, జేఎన్పీటీ ప్రాంతాల నుంచి ఫైరింజిన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి.
అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఉరాన్ నుంచి గ్యాస్ను గుజరాత్లోని హజీరా ఓఎన్జీసీ ప్లాంటుకు తరలిస్తున్నారు.