భార్యను, ఆమె ప్రియుడిని చంపేసిన నేవీ అధికారి
ముంబై: నేవీ అధికారి ఒకరు తన భార్యను, ఆమె ప్రియుడిని హత్య చేసి, ఆ తర్వాత నేవీ ముంబైలోని కమోతే పోలీసు స్టేషన్లో బుధవారం లొంగిపోయాడు. లొంగిపోయిన అధికారి భార్యకు మరో వ్యక్తితో గత ఎనిమిది నెలలుగా ఎఫైర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం మేరకు... 29 సంవత్సరాల ధృవకాంత్ ఠాకూర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. మెడకు బిగించుకున్న తాడు తెగిపోవడంతో బతికిపోయాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు.
తాను రెండు హత్యలు చేశానని పోలీసులకు చెప్పాడు. ధృవకాంత్, వాట్సాప్ ద్వారా పరిచయమైన సుస్మితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కమోథీలోని సెక్టార్ 19లో ఈ జంట నివాసం ఉంటున్నారు. ధృవకాంత్ తన ఉద్యోగ బాధ్యతల నిమిత్తం నెల, అంతకంటే ఎక్కువ ఇంటికి దూరంగా ఉంటారు.
ఈ నేపథ్యంలో సెలవు ముగించుకుని ఇంటికి వచ్చిన అతనికి సుస్మిత విడాకుల నోటీసులు ఇచ్చి సంతకం పెట్టమని డిమాండ్ చేసింది. అజయ్ అనే మరో వ్యక్తికి దగ్గరైనట్టు తెలిపి, అతన్ని వివాహం చేసుకునే ఉద్దేశం ఉన్నట్టు స్పష్టం చేసింది.
దీంతో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఆపై విధి నిర్వహణ కోసం వెళ్లిన ధృవకాంత్, మధ్యలోనే సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి వచ్చి ఉంటాడని ఊహించని సుస్మిత, తన ప్రియుడు అజయ్తో కలసి అపార్టుమెంటుకు వచ్చింది.
మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ జంట ఇంట్లోకి వెళ్లింది. దాదాపు పన్నెండు గంటల తర్వాత ధృవకాంత్ బయటకు వచ్చి వారిని హత్య చేసినట్లు సమాచారం.
అజయ్ గొంతులో పదునైన కత్తితో పలుమార్లు పొడిచాడు. సుస్మిత ముఖంపై దిండును అదిమిపెట్టి ఊపిరాడనీయకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడని, అతనిపై హత్యాభియోగం నమోదు చేసి కేసు దర్యాఫ్యు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.