సిద్ధూ దేశవ్యతిరేక వ్యాఖ్యలు, కపిల్ శర్మ షో నుంచి ఔట్: వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన నవజ్యోత్
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి కారణంగా నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై ఓవైపు యావత్ భారతదేశం బాధలో ఉంది. ఇందుకు కారణమైన పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవాలని, తీవ్రవాదులను ఏరిపారేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి స్థితిలో కొందరు అమరులైన జవాన్లను అవమానించేలా, దేశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
కోట్లాది మంది హిందువులకు ఆగ్రహం తెప్పించిన సిద్ధూ వ్యాఖ్యలు
ఇందులో భాగంగా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ తీవ్రవాద దాడికి పాకిస్తాన్ను బాధ్యులు చేయవద్దనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి మతం లేదా దేశం ఉండదని దారుణ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు పాకిస్తాన్ మన దేశంపైకి ఉగ్రవాదులను రెచ్చగొడుతుంటే సిద్ధూ ఇలా మాట్లాటం కోట్లాది మంది భారతీయులకు ఆగ్రహం తెప్పించింది.
కపిల్ శర్మ షో నుంచి సిద్ధూ అవుట్
ఊరంతా ఒకదారి అయితే ఉలిపి పిట్టది ఓదారి అన్నట్లు సిద్ధూ సహా దేశంలోని కొందరు మాట్లాడుతున్నారు. కాగా, సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో... కపిల్శర్మ తన షో నుంచి ఉన్నపళంగా సిద్ధూను తీసేశారు. సిద్ధూ స్థానంలో హాస్యనటి అర్చనా పూరణ్సింగ్ను చేర్చుకుని ఇక రాజీ లేదని తలుపులు మూసేశారు. ఆయనపై వెల్లువెత్తుతున్న విమర్శలను సాధారణంగా తీసుకోవడం లేదని, ఆయన కారణంగా చానెల్ను, షోను అనవసర వివాదాల్లోకి లాగాలనుకోవడం లేదని, అందుకే సిద్ధూను షోకూ దూరంగా పెట్టాలని నిర్ణయించామని, ఇప్పటికే అర్చనతో రెండు, మూడు ఎపిసోడ్లు షూట్ చేశామని చానెల్ స్పష్టం చేసిందట.
వక్రీకరించారని సిద్ధూ
మరోవైపు, పుల్వామా దాడి గురించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సిద్ధూ కొత్త వాదన మొదలు పెట్టారు. పాకిస్థాన్పై సానుభూతి చూపే విధంగా సిద్ధూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారానికి దారి తీయడం, ఆయనపై యావత్ భారతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో స్పందించారు. ఉగ్రవాదమనే సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టాలని మాత్రమే తాను అన్నానని, ప్రతిసారి సైనికులు ఎందుకు ఇబ్బందిపడాలని, ఇటువంటి దాడులు గత డెబ్బై ఏళ్ల నుంచి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి మతం లేదా జాతీయత ఉండదని, విషానికి విషమే విరుగుడు అని, మనం ఇదే పద్ధతిని అవలంభించాలని, చెడుపై పోరాటం విషయంలో కూడా మనం మంచి పద్ధతినే అవలంభిస్తున్నామని నేను అన్నానని, జమ్ము కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ బలగాల భద్రతకు మనం మరింత మెరుగైన ఏర్పాట్లు ఎందుకు చేయకూడదని, రాజకీయ నేతలు బయటకు వస్తే ముందస్తు భద్రత కింద వీధులన్నింటినీ బ్లాక్ చేస్తారని, మరి మనకు భద్రత కల్పించే 3000 మంది జవాన్లు బయటకు వస్తే వారి భద్రత విషయంలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని, వాళ్లను వాయు మార్గంలో ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. దీని ప్రభావం కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా నిర్మాణంపై ఏమాత్రం పడదన్నారు. ఈ ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు చేసిన పని ప్రభావం కర్తార్పూర్ కారిడార్పై పడే ప్రశ్నే లేదని, ఉగ్రవాదుల ముందు దేశం ఎన్నటికీ తలవంచబోదన్నారు. ఆయన శుక్రవారం పుల్వామా దాడిని ఖండిస్తూనే కొందరు చేసిన తప్పుకు మొత్తం దేశాన్నే నిందిస్తారా అని పాక్కు వత్తాసు పలికినట్లుగా మాట్లాడారు. హింస ఎల్లప్పుడూ ఖండించదగ్గదేనని, బాధ్యులను తప్పకుండా శిక్షించాల్సిందేనని అన్నారు.