సింగ్ వర్సెస్ సిద్దూ : జరిగిన పరిణామాలపై రాహుల్కు వివరణ .. ప్రాధాన్యం తగ్గిస్తున్నారని ఫిర్యాదు
న్యూఢిల్లీ : గత కొంతకాలంగా పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన పరిణామాలు పీక్కి చేరిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే మంత్రి సిద్దూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా తాను రాజీనామా చేస్తానని ప్రస్తావించగా .. రాహుల్ సర్దిచెప్పినట్టు సమాచారం.
సింగ్ వర్సెస్ సిద్దూ ..
పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం అమరిందర్ సింగ్ వర్సెస్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమికి సిద్దూ కారణమని అమరిందర్ బాహాటంగానే అనడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశానికి సిద్దూ వచ్చి .. వెళ్లిపోయారు. దీంతో సిద్దూ నిర్వహిస్తున్న కీలకశాఖ స్థానిక సంస్థల శాఖను అమరిందర్ తీసివేశారు. దీంతోపాటు పర్యాటక, సాంస్కృతిక శాఖలను కూడా లాక్కున్నారు. ఇప్పుడు సిద్దూ చేతిలో విద్యుత్ శాఖ ఒక్కటే ఉంది.
రాహుల్తో భేటీ ..
అమరిందర్తో వివాదం ముదిరిపోవడంతో .. కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీని కలువాలని సిద్ధూ గత వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. అయితే రాహుల్ ఇతర పర్యటనల వల్ల వీలుకాలేదు. నిన్న కేరళ ప్రజలకు ధన్యవాదాలు చెప్పే పర్యటన ముగియడంతో ఢిల్లీ చేరుకున్నారు రాహుల్. దీంతో పంజాబ్ సర్కార్లో తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు ఢిల్లీ చేరుకున్నారు సిద్దూ. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేత అహ్మద్ పటేల్ పాల్గొన్నారు.
శాఖలను తీసి ..
రాష్ట్ర ప్రభుత్వంలో తనకు జరుగుతన్న అన్యాయాన్ని వివరించారు సిద్దూ. తన శాఖలను తీసివేశారని .. అప్రాధాన్య పోర్టు ఫోలియో కేటాయించారని వాపోయారు. ఎన్నికల ఫలితాల నెపం తనపై వేశారని గుర్తుచేశారు. ఒకనొక క్రమంలో పార్టీకి, మంత్రి పదవీకి రాజీనామా చేస్తానని సిద్దూ చెప్పినట్టు తెలుస్తోంది. కానీ రాహుల్ వద్దని వారించినట్టు సమాచారం. పార్టీలో, ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీనిచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గత నెలరోజుల నుంచి సిద్దూ, అమరిందర్ సింగ్ మధ్య వివాదం పీక్ స్టేజీకి చేరింది. సిద్దూ నిర్వహిస్తున్న స్థానిక సంస్థల శాఖ పనితీరు బాగోలేదని సీఎం అమరిందర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
వెన్నెముక ..
రాష్ట్రంలోని పట్టణాలు కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టని గుర్తుచేశారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ తగ్గిపోయిందని అమరిందర్ మండిపడ్డారు. సిద్దూ అసమర్థత వల్లే కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు కోల్పోయిందని స్పష్టంచేశారు. వెన్నెముక లాంటి పట్టణ ఓటర్లు మళ్లిపోవడానికి కారణమెవరు అని ప్రశ్నించారు. తనను బాహాటంగానే ప్రశ్నించడతో సిద్దూ నొచ్చుకున్నారు. క్యాబినెట్ నిర్వహించే సమావేశాలకు హాజరుకావడం లేదు. దీంతో సిద్దూ శాఖలను ఆయనకు తెలియకుండానే సీఎం అమరిందర్ మార్చివేశారు. దీంతో తనను అన్యాయంగా బ్లేమ్ చేస్తున్నారని .. ప్రయారిటీ తగ్గించారని సిద్దూ వాపోయారు. ఈ మేరకు రాహుల్ను కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించగా .. అదేం లేదని సముచిత స్థానం కల్పిస్తామని రాహుల్ చెప్పినట్టు తెలుస్తోంది.