పుల్వామాపై ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతి జవానుకు ఇద్దరి తలలు తేవాలి: పంజాబ్ సీఎం, సిద్ధూపై నిప్పులు
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాద దాడిపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సోమవారం స్పందించారు. ఒకరికి ఇద్దరు జవాన్లను (పాకిస్తాన్ జవాన్లు) తీసుకు రావాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూపై నిప్పులు చెరిగారు. జవాన్లను కోల్పోయిన బాధ సిద్ధూకు తెలియడం లేదని మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన భారత జవాన్లకు రెట్టింపు సంఖ్యలో ప్రతీకారం తీర్చుకొని ఉగ్రవాదులకు, పాక్కు బుద్ధి చెప్పాలన్నారు.
ఇప్పటి వరకు మన జవాన్లు 41మంది చనిపోయారని, వాళ్లను 82 మందిని బలి తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. కన్నుకు కన్ను పంటికి పన్ను తప్పనిసరి అన్నారు. పాక్ను సైనిక, దైత్య, ఆర్థికపరంగా దెబ్బ కొట్టాలని చెప్పారు. ఇంతమందిని పొట్టన పెట్టుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. కార్గిల్ యుద్ధంలో భారత బలగాలు పాక్ను దీటుగా ఓడించి బుద్ధి చెప్పాయని, భారత సైనికబలం ముందు పాక్ నిలబడలేదన్నారు.
పాకిస్తాన్ అణుబాంబులున్న దేశమైతే మనం ఒక్కొక్కరం ఒక్కో అణు బాంబులం అని అమరీందర్ సింగ్ తెలిపారు. సైనికులను కోల్పోవడం వల్ల కలిగే నష్టం సిద్ధూకు తెలియదని విమర్శలు గుప్పించారు.
కాగా, సిద్ధూ గతంలో ఉగ్రదాడిని ఖండిస్తూ.. ఉగ్రవాదులు చేసిన తప్పునకు దేశం మొత్తాన్ని నిందించడం తగదని చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. 1999లో కందహార్ ఘటనలో దోషులను ఎవరు విడుదల చేశారు? దానికి ఎవరు బాధ్యులు? మనం పోరాటం వారికి వ్యతిరేకంగా అయితే సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి? ఈ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం ఎందుకు తీసుకురావటం లేదు? ఉగ్రవాదానికి మతం ఉండదన్నారు.
పాక్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సిద్ధూను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పించాలని అకాలీదళ్నేత ప్రకాశ్సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. నిజానికి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించే ఇలాంటి వారిపై కేసు నమోదు చేయాల్సి ఉందన్నారు.