మాట్లాడలేని స్థితిలో నవజ్యోత్ సింగ్ సిద్ధు: స్టెరాయిడ్లతో అత్యవసర చికిత్స
చండీగఢ్: మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఆయన స్వర పేటిక దెబ్బతిన్నట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీనితో అత్యవసర చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా నవజ్యోత్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొంటున్నారు.
పంజాబ్లో సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు సిద్ధూ. పంజాబ్ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, బిహార్, హిమాచల్ ప్రదేశ్లల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం సాగిస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో సుమారు 80కి పైగా రోడ్షోలల్లో పాల్గొన్నారు. ప్రసంగించారు. నిరంతరాయంగా ప్రసంగిస్తూ ఉండటం వల్ల ఆయన అనారోగ్యానికి గురైనట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఆయనకు డాక్టర్లు అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. స్టెరాయిడ్, ఇంజెక్షన్లను ఇస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రచార సారధ్యాన్ని తన భుజానికెత్తుకున్నారు సిద్ధూ. నెలరోజుల వ్యవధిలో 80కి పైగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధూ చేసిన అనేక వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని సిద్ధూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీరిక లేకుండా ఎన్నికల ప్రదర్శనలు, సభల్లో పాల్గొనడం, చేసిన ప్రసంగాల వల్ల ఆయన స్వరపేటిక దెబ్బతిన్నదని డాక్టర్లు తెలిపారు.
గొంతునొప్పితో బాధపడిన ఆయన ఆదివారం ఉదయం చండీగఢ్లో డాక్టర్ల వద్ద పరీక్ష చేయించుకున్నారు. విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచింరారు. బిజీ షెడ్యూల్ వల్ల ఆయన విశ్రాంతి తీసుకోలేకపోయారని, ఆదివారం కూడా ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారని పార్టీ నాయకులు చెప్పారు. ఫలితంగా- ఆయన స్వర పేటిక దెబ్బతిన్నదని అన్నారు. సిద్ధూకు నాలుగురోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో స్వర పేటిక మామూలు స్థితికి చేరుకుంటుందని అన్నారు.