సిద్దూకు వైష్ణోదేవి ఆలయంలో ప్రయారిటీ ఎందుకు..? ప్రో పాకిస్థాన్ కామెంట్లపై శివసేన గుస్సా
కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూపై శివసేన నేతలు విరుచుకుపడ్డారు. కశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయం వద్ద సిద్ధూకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. ఆయన ఇదివరకు పాకిస్థాన్కు అనుకూలంగా ప్రకటనలు చేశారని దుమ్మెత్తిపోశారు. సోమవారం శివసేన నేతలు కశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిద్దూ వైఖరిపై ఓ రేంజ్లో ఫైరయ్యారు.
సిద్దూ పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేశాడని శివసేన నేతలు మండిపడ్డారు. అలాంటి సిద్దూకు వైష్ణో దేవి ఆలయం వద్ద వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. గత ఫిబ్రవరిలో పుల్వామా దాడి జరిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అంతకుముందు గతేడాది నవంబర్లో సిద్దూ పాకిస్థాన్లో పర్యటించారు. కర్తాపూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను కొనియాడారు. దీంతో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.
అంతకుముందు ఆగస్టులో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా సిద్దు హాజరయ్యారు. ఆ సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను కౌగిలించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విపక్షాలు సిద్ధూ, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. పంజాబ్ మంత్రిగా ఉన్న సిద్దూ.. తన శాఖలను సీఎం అమరీందర్ సింగ్కు మార్చడంతో మంత్రి పదవులకు సిద్ధూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని కూడా వీడతారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పార్టీ వీడటంపై స్పందించలేదు. బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్దూ.. ఇక్కడ కూడా అడకత్తెరలో పొక అన్నట్టు పరిస్థితి మారింది.