నిఘా పెట్టిందా?: చైనా నౌకను తరిమేసిన ఇండియన్ నేవీ
న్యూఢిల్లీ: మనదేశ సముద్ర జలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ చైనా నౌకను భారత నావికాదళం తరిమికొట్టింది. ఈ ఘటన అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్బ్లెయిర్ వద్ద చోటు చేసుకుంది. చైనాకు చెందిన షియాన్ 1 అనే నౌక ఈ ప్రాంతంలోని సముద్ర జలాలలో పరిశోధనా కార్యక్రమాలు చేస్తోంది.
అయితే, మన దేశ జలాల్లోకి రావడంతో మన నావికాదళ నిఘా విమానం పసిగట్టింది. దీంతో పరిస్థితిని తెలుసుకునేందుకు భారత్ ఒక యుద్ధ నౌకను అక్కడికి పంపింది. భారత్కు చెందిన ప్రత్యేక వాణిజ్య జోన్లో ఇతర దేశాలకు చెందిన నౌకలు పరిశోధనా లేదా అన్వేషణ కార్యకలాపాలు సాగించడం నిషిద్ధం.
ఈ క్రమంలో ఆ చైనా నౌకను భారతీయ జలాల్లోనుంచి బయటకు వెళ్లమని మన దేశ యుద్ధ నౌక హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ నౌక భారత సముద్ర జలాల నుంచి చైనా వైపు కదిలిపోయినట్లు సమాచారం. కాగా, ఆ నౌకను చౌనా తన గూఢచర్య కార్యకలాపాలకు కూడా వాడుతుందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, హిందూ మహా సముద్ర జలాల్లో, ఆగ్నేయ సముద్ర జలాల్లో జరిగే కార్యకలాపాలపై మనదేశం నిఘా వేసి ఉంచడానికి అండమాన్ నికోబార్ ప్రాంతం కీలకంగా ఉంంది. సముద్రపు దోపిడీలను నిరోధించడం అనే వంకతో భారత సముద్ర జలాల్లోకి తరచుగా చైనాకు చెందిన నౌకలు వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత నావికాదళం గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. జిత్తులమారి చైనాకు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూనే ఉంది.