అసభ్యంగా తాకుతూ!: నేవిలో మహిళా అధికారిణులకి లైంగిక వేధింపులు
చెన్నై: ఆరుగురు నేవి మహిళా అధికారులు సముద్రయాణం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చారని ఓవైపు దేశమంతా గర్వపడుతుంటే.. మరోవైపు నేవిలోని కొంతమంది ఉన్నతాధికారులు మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు వెలుగుచూస్తుండటం గమనార్హం.
అసభ్యంగా తాకుతూ..
ఇద్దరు నేవి మహిళా అధికారులను లైంగికంగా వేధించినందుకు ఓ అధికారిని విధుల నుంచి తప్పించాలని కోరుతూ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు విచారణలో అతని వేధింపులు నిజమేనని తేలింది. రెండు వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు మహిళ అధికారులను అసభ్యంగా తాకుతూ సదరు అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కోర్టు నిర్దారించింది.
పరందు నేవి యూనిట్
దక్షిణ తమిళనాడులోని పరందులో ఉన్న నేవి యూనిట్ లో సదరు అధికారి పనిచేస్తున్నారు. వేధింపులకు గురైన ఇద్దరు మహిళా అధికారులు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. సదరు అధికారికి భార్యతో విభేదాలున్నాయని చెబుతున్నారు. నేవి ఉద్యోగులంతా కలిసిన ఓ పార్టీలో సదరు అధికారి ఓ మహిళా అధికారిణిని అసభ్యంగా తాకినట్టు చెబుతున్నారు.
ఆ ఘటన తర్వాతే!:
అయితే అధికారి లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరూ లేరు. అదీగాక.. రెస్క్యూ మిషన్ సందర్భంగా నిబంధనలు పాటించలేదని సదరు అధికారి ఆ ఇద్దరు మహిళా అధికారిణులను మందలించిన తర్వాతే ఆయనపై కేసు పెట్టారన్న వాదన కూడా వినిపిస్తోంది.
గతంలో ఢిల్లీలో:
ఇటీవలి కాలంలో నేవిలో లైంగిక వేధింపులకు సంబంధించి ఇది రెండో కేసు. ఇంతకుముందు ఢిల్లీలోని నేవి కార్యాలయంలో ఓ డాక్టర్ మహిళా డాక్టర్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది.