ఉగ్రవాదుల కదలికలు: ముంబైలో నేవీ హై అలర్ట్
ముంబై: ముంబై నగరంలో నేవీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నేవీ బేస్ సమీపంలో దుండగులు అత్యాధునిక ఆయుధాలతో సంచరిస్తున్నారని సమాచారం వచ్చిన నేపధ్యంలో నేవీ అధికారులు అప్రమత్తం అయ్యారు.
ముంబై నగర సమీపంలోని ఉరాన్ ప్రాంతంలో నలుగురు వ్యక్తులు నల్లటి దుస్తులు ధరించి చేతిలో ఆయుధాలు పెట్టుకుని సంచరిస్తున్నారని స్కూల్ విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై డీఎస్పీ దిలీప్ సావంత్ స్పందించారు. దుండగుల కోసం గాలిస్తున్నామని, ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు తమకు కపడలేదని స్పష్టం చేశారు. అయితే మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్, ముంబై పోలీసులు రంగంలోకి దిగి అప్రమత్తం అయ్యారు.
స్థానిక మీడియా చానెల్స్ కథనం మేరకు గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో నలుగురు సైనిక దుస్తులు ధరించి ఉరాన్ ప్రాంతానికి వచ్చినట్లు వార్తలు ప్రసారం చేశాయి. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించడానికి పోలీసు అధికారులు నిరాకరిస్తున్నారు.