భారత నేవీ మరో ఘనత- నౌకా విధ్వంస క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
భారతీయ నౌకదళం మరో అరుదైన ఘనత సాధించింది. నౌక నుంచి నౌకపైకి క్షిపణిని ప్రయోగించి దాన్ని విధ్వంసం చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అరేబియా సముద్రంలో క్షిపణి కార్వెట్ ఐఎన్ఎస్ ప్రబల్ నుంచి ప్రయోగించిన ఓ క్షిపణి గరిష్ట దూరంలో ఉంచిన మరో వాడకంలో లేని నౌకను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను నేవీ ఇవాళ విడుదల చేసింది.
అరేబియా సముద్రంలో నిర్వహించిన ఈ ప్రయోగంలో గరిష్ట దూరంలో ఉంచిన నౌకను క్షిపణి కచ్చితంగా ఛేదించడమే కాకుండా దాన్ని విధ్వంసం చేసి సముద్రంలో ముంచేసినట్లు నేవీ విడుదల చేసిన వీడియోలో కనిపించింది. నేవీ ప్రాక్టీస్ డ్రిల్లో భాగంగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు నేవీ ఓ ట్వీట్ కూడా పెట్టింది. ఇప్పటికే భూమి పై నుంచి నౌకలపై ప్రయోగించే క్షిపణులను భారత్ వాడుకుండగా.. ఇప్పుడు నౌకలపై నుంచి నౌకలపై లక్ష్యాలను కూడా గరిష్ట దూరంలోనూ కచ్చితంగా ఛేదించడం విశేషం.
#AShM launched by #IndianNavy Missile Corvette #INSPrabal, homes on with deadly accuracy at max range, sinking target ship. #StrikeFirst #StrikeHard #StrikeSure #हरकामदेशकेनाम pic.twitter.com/1vkwzdQxQV
— SpokespersonNavy (@indiannavy) October 23, 2020
చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నేవీ అన్ని విధాలా సన్నద్దంగా ఉంటోంది. ఇందులో భాగంగానే హిందూ మహాసముద్రంతో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోనూ ప్రాక్టీస్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఐఎన్ఎస్ ప్రబల్ నుంచి క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇది తొలిసారా కాదా అన్నది మాత్రం నౌకాదళ వర్గాలు స్పష్టం చేయలేదు. అయితే గరిష్ట దూరంలో లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడం పట్ల మాత్రం నేవీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.