నేపాల్ భూకంపం: నవాజ్ షరీఫ్ నన్ను మెచ్చుకున్నారన్న మోడీ
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అభినందించారు. నేపాల్ భూకంపం నేపథ్యంలో భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోడీ పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకుముందే నేపాల్కు చెందిన మనీషా కోయిరాలాతో పాటు పలువురు మోడీని మెచ్చుకున్నారు.
ఇప్పుడు పొరుగు దేశమైన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మెచ్చుకోవడం గమనార్హం. ఆయన ప్రధాని మోడికి గురువారం ఉదయం ఫోన్ చేశారు. నేపాల్లో భారత సహాయ చర్యలను ప్రశంసించారు. అదే సమయంలో నేపాల్ భూకంపం కారణంగా నేపాల్లో, భారత్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. సార్క్ దేశాలు సంయుక్తంగా విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని మోడీ పాక్ ప్రధానికి సూచించారు.
ఈ విషయమై ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా కూడా పేర్కొన్నారు. నేపాల్ భూకంపం నేపథ్యంలో భారత్ సహాయక చర్యల పైన పాకిస్తాన్ ప్రధాని ప్రశంసించారని, అందుకు తాను అతనికి థ్యాంక్స్ చెబుతున్నానని ట్వీట్ చేశారు. అదే సమయంలో తాను నవాజ్ షరీఫ్కు ఓ సూచన చేశానని, సార్క్ దేశాలు సంయుక్తంగా విపత్తుల నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరానని చెప్పారు.
తన సూచనను పాక్ ప్రధాని ప్రశంసించారని, అలాంటి చర్యలు చేపట్టేందుకు నవాజ్ షరీఫ్ ముందుకు వచ్చారని చెప్పారు. అదే సమయంలో ప్రధాని మోడీ, పాకిస్తాన్ ప్రధాని నరేంద్ర మోడీ మధ్య పాకిస్తాన్లో వచ్చిన అకాల వర్షాలు, మృతులు, పంట నష్టం పైన కూడా చర్చ జరిగింది.