'కేజ్రీవాల్ ఓ నక్సలైట్, సంవత్సరం తిరక్కుండానే': స్వామి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓ నక్సలైట్ అంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అభివర్ణించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే, అరవింద్ కేజ్రీవాల్ సంవత్సరం తిరక్కుండానే ముఖ్యమంత్రి పదవిని మళ్లీ వదిలేస్తారని విమర్శించారు.
అరవింద్ కేజ్రీవాల్ నక్సలైట్ స్వభావం కలిగిన వ్యక్తి అని, ఆయన సహచరులు అందరూ నక్సలైట్ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు కావడంతో ప్రభుత్వాన్ని నడపలేరని సుబ్రమణ్య స్వామి తెలిపారు.
ఈ ఎన్నికలతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీరో అయిందన్నారు. కాంగ్రెస్ ఓటర్లంతా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారని, ఈ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోడీపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని అన్నారు.
బీజేపీ సీఎం అభ్యర్ధి కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారంలో చాలా ఆలస్యంగా చేరారని అన్నారు. ఈ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యే జరిగాయని అన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆప్కి అనుకూలంగా వెల్లడైన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి పైవిధంగా పేర్కొన్నారు.
70 అసెంబ్లీ స్ధానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 673 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 7న జరిగితే... ఫలితాలు ఫిబ్రవరి 10న విడుదలవనున్నాయి.