Ayodhya: వార్తా సంస్థలకు ఎన్బీఎస్ఏ కీలక సూచనలు
న్యూఢిల్లీ: రామ మందిరం-బాబ్రీ మసీదు భూ వివాదం కేసు కవరేజి విషయంలో వార్తా సంస్థలకు పలు కీలక సూచనలు చేసింది న్యూస్ బ్రాడ్కాస్టర్స్ స్టాండర్డ్ ఆథారిటీ(ఎన్బీఎస్ఏ). సుప్రీంకోర్టులో జరిగే వాదనలు, ప్రక్రియకు సంబంధించిన విషయాలపై ఎలాంటి ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని స్పష్టం చేసింది.
వాదనలకు సంబంధించి ఎలాంటి విషయాలను అంచనాలు వేస్తూ కథనాలుగా రాయవద్దని తెలిపింది. మసీదు కూల్చివేతకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. సంబరాలు చేసుకునే వీడియోలను కూడా ఉపయోగించవద్దని పేర్కొంది. డిబేట్లలో ఎలాంటి విపరీతమైన వాదనలను ప్రసారం చేయవద్దని వార్తా సంస్థలకు ఆదేశాలు జారీచేసింది ఎన్బీఎస్ఏ.
కాగా, అయోధ్య భూవివాదం కేసులో చివరి వాదనలు సుప్రీంకోర్టులో ముగిశాయి. ఇప్పటికే 39 సార్లు అయోధ్య రామమందిరం బాబ్రీమసీదు భూవివాదంలో కోర్టు వాదనలు వినింది. ఇక చివరి సారిగా అంటే 40వ సారిగా అత్యున్నత న్యాయస్థానం వాదనలు బుధవారం వినింది. దీంతో ఇక అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు కేవలం తీర్పు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్లో ఉంచింది. తీర్పుచీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా వస్తుందని భావిస్తున్నారు.
News Broadcasting Standards Authority (NBSA) issues advisory on #AyodhyaHearing coverage:
— ANI (@ANI) October 16, 2019
*Do not speculate court proceedings.
*Ascertain facts of hearing.
*Do not use mosque demolition footage.
*Do not broadcast any celebrations.
*Ensure no extreme views are aired in debates.
అయోధ్య భూవివాదం కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది. ఆగష్టు 6 నుంచి రోజువారీగా ఈ విచారణను ఈ బెంచ్ చేపడుతోంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు హిందూ సంఘాలు ముస్లిం సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. 2.77 ఎకరాల స్థలంను ఆలయ ప్రధాన పూజారి రామ్లల్లా, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్బోర్డులకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాలు చేస్తూ 2011లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక అప్పటి నుంచి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
1992 డిసెంబర్ 6వ తేదీన 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. అయితే అత్యున్నత న్యాయస్థానం మాత్రం అక్టోబర్ 17న వాదనలు వినేందుకు చివరిరోజని ప్రకటించింది. ఇక తీర్పు నవంబర్ 4 లేదా 5వ తేదీల్లో వెలువడే అవకాశం ఉంది.