ఎకె 47తో ఫేస్బుక్లో ఎన్సీ నేత కుమారుడి ఫొటో
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత నసీర్ అస్లాం వాని కుమారుడు ఫేస్బుక్లో ఎకె 47 గన్తో దర్శనమిచ్చాడు. పోలీసు అధికారులతో పాటు ఎకె47 పట్టుకుని దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేసినట్లు మీడియాలో సోమవారం వార్తలు వచ్చాయి. ఈ ఫొటో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
నసీర్ అస్లామ్ మాత్రం తన కుమారుడిని వెనకేసుకొచ్చారు. ఈ విషయంపై నసీర్ను ప్రశ్నిస్తే, ఫొటో గురించి తనకు ఏమీ తెలియదని, తన కుమారుడి ఫేస్బుక్ పేజీని పరిశీలిస్తానని చెప్పారు. తన కుమారుడు పోలీసు అధికారి కావాలని కోరుకుంటున్నాడని చెబుతూ అది తప్పా అని ప్రశ్నించారు.
శ్రీనగర్లోని తమ నివాసం ఎదుట నసీర్ అస్లాం వాని కుమారుడు నిలుచుని ఎకె 47 పట్టుకున్న ఫొటో ఫేస్బుక్లో దర్శనమిచ్చింది. అయితే, అది నిజమైన చిత్రం కాదని, దాన్ని మార్పులు చేర్పులు చేశారని నసీర్ ఆ తర్వాత చెప్పారు. నసీర్ అస్లాం వాని కుమారుడు ఎవరినీ బెదిరించలేదని, కేవలం అలా పట్టుకున్నాడని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు అంటున్నారు.
అయితే, ఆ ఫొటోపై బిజెపి తీవ్రంగా స్పందించింది. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పు పట్టింది. ఆ అబ్బాయికి తుపాకి పట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వాని కుమారుడి ఉదంతం చాలా తీవ్రమైందని బిజెపి నాకుడు సునీల్ సేథీ వ్యాఖ్యానించారు.