బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్యం: నార్కొటిక్స్ సీనియర్ అధికారికి: వారికి ఊరట: టెంపరరీ బ్రేక్?
ముంబై: బాలీవుడ్ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కుంభకోణం విచారణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావం.. కేసు పురోగతిపై కనిపించే అవకాశాలు లేకపోలేదు. డ్రగ్స్ కేసు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడటమో లేక.. వేగం తగ్గడమో సంభవించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిణామం బాలీవుడ్ సెలెబ్రిటీలకు తాత్కాలికంగా ఊరట కలిగిస్తుందని చెబుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు సాగిస్తోన్న నార్కొటిక్స్ ఉన్నతాధికారికి కరోనా సోకింది.
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనితో ప్రస్తుతం ఈ కేసును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రగ్స్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలీవుడ్కు చెందిన పలువురు టాప్ సెలెబ్రిటీలకు నార్కొటిక్స్ అధికారుల నుంచి నోటీసులు అందాయి. విచారణకూ హాజరు అవుతున్నారు. టాప్ హీరోయిన్లు దీపికా పడుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి బాలీవుడ్ పర్సనాలిటీలు నార్కొటిక్స్ అధికారుల వద్ద విచారణను ఎదుర్కొన్నారు.
తాజాగా- ఈ కేసును విచారిస్తోన్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్ర కరోనా వైరస్ బారిన పడ్డారు. అనారోగ్యానికి గురైన ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. దీనితో ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. రెండువారాల పాటు క్వారంటైన్ కాలాన్ని గడిపిన తరువాత ఆయన మళ్లీ బాధ్యతల్లోకి చేరుతారని చెబుతున్నారు. మల్హోత్రాకు వైరస్ ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా ఆయనకు ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకిందనేది చర్చనీయాంశమౌతోంది.
Recommended Video
ఆయన మళ్లీ బాధ్యతలను చేపట్టేంత వరకూ బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో బ్రేక్ పడొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. మల్హోత్రా స్థానంలో మరో అధికారికి ఈ బాధ్యతలను అప్పగిస్తారనే వాదన కూాడా వినిపిస్తోంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇటు కర్ణాటక చిత్ర పరిశ్రమనూ తాకిన విషయం తెలిసిందే. ఇప్పటికే శాండల్వుడ్కు చెందిన పలువురు ప్రముఖులు విచారణను ఎదుర్కొంటున్నారు. నటి సంజన, రాగిణి ద్వివేది అరెస్టు అయ్యారు. పోలీసుల కస్టడీలో ఉంటున్నారు.