సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఎన్సిబి 30,000 పేజీల చార్జిషీట్.. నిందితుల్లో రియాతో పాటు మరో 32 మంది
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ విచారణ జరుపుతుంది. సుశాంత్ మృతి చెంది ఇంత కాలం అవుతున్నా ఆయన మరణంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగానే ఈ మిస్టరీ మరణం కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది . సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణంతో లింక్ అయి ఉన్న బాలీవుడ్ డ్రగ్స్ కుంభకోణంలో ఎన్సీబీ దర్యాప్తు కొనసాగింది.

సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్ కేసులో 30,000 పేజీలకు పైగా చార్జ్ షీట్
ఈ కేసును చాలా సీరియస్ గా విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) శుక్రవారం సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్ కేసులో తన చార్జిషీట్ దాఖలు చేయనుంది. 30,000 పేజీలకు పైగా ఉన్న చార్జిషీట్ను ఎన్సిబి చీఫ్ సమీర్ వాంఖడే స్వయంగా దాఖలు చెయ్యనున్నారు .
డ్రగ్స్ కేసులో ఒక నెల జైలు శిక్ష అనుభవించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి కూడా ఎన్సిబి చార్జిషీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఉన్నారు .

ఎన్సిబి తయారుచేసిన చార్జిషీట్లో రియాతో సహా మొత్తం 33 మంది పేర్లు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్ కేసులో ఎన్సిబి తయారుచేసిన చార్జిషీట్లో మొత్తం 33 మంది పేర్లు ఉన్నాయి.
రియా చక్రవర్తితో పాటు, ఎన్సిబి అనేక మంది డ్రగ్ పెడ్లర్లు మరియు ఇతర నిందితులపై చార్జిషీట్లో పేర్కొంది. డ్రగ్స్ కేసులో దర్యాప్తులో ఈ నిందితుల్లో ఎక్కువ మందిని ఎన్సిబి అరెస్టు చేసింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ గత ఏడాది జూన్లో తన బాంద్రా అపార్ట్మెంట్లో శవమై కనిపించారు, ఇది బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మరియు బాలీవుడ్ పనితీరుపై పెద్ద చర్చకు దారితీసింది. ఆపై అనేక ప్రముఖుల పేర్లతో కూడిన డ్రగ్స్ కేసుగా మారింది.

సుశాంత్ మరణం కేసును విచారించిన ఈడీ .. డ్రగ్స్ కోణంతో కేసు ఎన్సీబీ కోర్టులోకి
సుశాంత్ సింగ్ రాజ్పుత్కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి , సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తితో సహా పలు అరెస్టులు జరిగాయి.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెల్లడించిన తరువాత డ్రగ్స్ కేసును గత ఆగస్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో నమోదు చేశారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయంతి సాహా మరియు దిపేష్ సావంత్, శామ్యూల్ మిరాండా మరియు మరికొందరు ఉద్యోగుల మొబైల్ ఫోన్ల నుండి దొరికిన డ్రగ్స్ చాట్ సందేశాలకు సంబంధించి ఈడీ తన విచారణను ఎన్సిబితో పంచుకుంది.

డ్రగ్స్ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ .. చార్జ్ షీట్ పై సర్వత్రా ఆసక్తి
ఈ వెల్లడి తరువాత, ఎన్సిబి అధికారులు మిరాండా, సావంత్, రియా మరియు షోయిక్ నివాసాలను శోధించారు . తరువాత ఈ కేసులో వారిని అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల సరఫరా మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను ఆశ్రయించినందుకు రియా, షోయిక్, దీపేశ్ మరియు మిరాండాపై కేసు నమోదైంది. రియా, షోయిక్, దీపేశ్, మిరాండా ప్రస్తుతం బెయిల్పై విడుదలై బయట ఉన్నారు . ఎన్సీబీ 30,000 పేజీలకు పైగా ఉన్న చార్జిషీట్ను దాఖలు చెయ్యనున్న నేపధ్యంలో చార్జ్ షీట్ లో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది .