‘హై రిస్క్’తో వైరస్ వ్యాప్తి.. రాత్రంతా రోడ్లపైనే జనం.. ఇరాన్ నుంచి 275 మంది.. పైలట్కు పాజిటివ్
దేశరాజధాని ఢిల్లీతోపాటు అన్ని మహానగరాల నుంచి లక్షల సంఖ్యలో వలస కూలీలు మహానిర్గమనం చేయడాన్ని కేంద్రం ''హై రిస్క్''గా గుర్తంచింది. లాక్ డౌన్ నిబంధనల్ని లక్షల మంది రోడ్లపైకి రావడం.. కనీస జాగ్రత్తలు పాటించకుండా గుంపులుగా సంచరించడాన్ని సీరియస్ గా తీసుకుంది. మరోవైపు, వైరస్ విలయతాండవం చేస్తోన్న ఇరాన్ లో చిక్కుకుపోయిన 275 మంది భారతీయులు ఆదివారం ఉదయం భారత్ కు చేరుకున్నారు. నెల రోజులుగా అంతర్జాతీయ సర్వీసులు నడపకున్నా స్పైస్జెట్ పైలట్ ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడం చర్చనీయాంశమైంది.
రాత్రంతా రోడ్లపైనే..
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడం, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ పొడగించే అవకాశాలుండటంతో ఢిల్లీలో రకరకాల పనులు చేసుకునే లక్షల మంది వలస కూలీలు ఒక్కసారిగా ఇంటిబాటపట్టడం తెలిసిందే. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో వాళ్లంతా యూపీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లోని తమ సొంతూళ్లకు నడుచుకుంటూ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి మొదలైన ఈ నిర్గమనం.. శనివారానికి పీక్స్ కు చేరింది. కేంద్రం ఆదేశాల మేరకు యూపీ సర్కారు 1000 బస్సుల్ని సిద్ధం చేసింది. ఢిల్లీ సర్కారు కూడా 200 బస్సుల్ని అందుబాటులకి తెచ్చింది. దీంతో ఆనంద్ విహార్ బస్టాండ్, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లో జనం రాత్రాంతా రోడ్లపైనే బస్సుల కోసం నిలబడిపోయారు. కాగా,
కూలీల అడుగుజాడల్లో ఎన్సీడీసీ
లక్షల మంది వలస కూలీలు నగరాలను వీడి గ్రామాలకు చేరుతుండటంతో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) హుటాహుటిన రంగంలోకి దిగింది. కూలీల అడుగుజాడల్లోనే.. వాళ్లు ప్రయాణించిన జిల్లాలు, వారి గ్రామాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పట్టణాల నుంచి గ్రామాలకు వైరస్ వ్యాప్తి చెందడం.. లేదా ఇప్పటికే గ్రామల్లో తిష్టవేసిన వైరస్ కొత్తగా వచ్చినవాళ్లకు అంటుకునే ఆస్కారం ఎక్కువగా ఉండటంతో.. లాక్ డౌన్ తర్వాత ప్రయాణాలు చేసిన వలస కూలీలు అందరినీ ‘‘హై రిస్క్''గా గుర్తించామని ఎన్సీడీసీ అధికారులు ప్రకటించారు.
ఆయా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..
వలస కూలీలు ఎక్కువగా ప్రయాణాలు చేసిన యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం అదనపు ఆదేశాలు జారీచేసింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్(ఐడీఎస్పీ)ని తక్షణం చేపట్టాలని, వసల కూలీల సొంత గ్రామాలను గుర్తించి, వాటికి దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాల్లో వెంటనే వసతులు పెంచాలని, ఆయా మండల, జిల్లా కేంద్రాల్లో అదనంగా ఐసోలేషన్, ఐసీయూ వార్డుల్ని ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలిసింది.
విమానంలో వచ్చిన 275 మంది..
లాక్ డౌన్ ఆదేశాలకు విరుద్ధంగా మహానగరాల నుంచి లక్షల మంది వలస కూలీలు సొంత ఊళ్లకు ప్రయాణించడంపై ఆందోళన నెలకొన్నవేళ.. కరోనా వైరస్ విలయతాండవం చస్తోన్న ఇరాన్ నుంచి కొత్తగా 275 మంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. వాళ్లలో 133 మంది మహిళలు, 142 మంది పురుషులున్నారు. ప్రత్యేక విమానంలో వీరంతా ఆదివారం జోధ్ పూర్ ఎయిర్ బేస్ కు చేరుకోగా.. అక్కడికక్కడే టెస్టులు నిర్వహించిన యంత్రాంగం.. ప్రయాణికులందరినీ జోధ్ పూర్ మిలిట్రీ స్టేషన్ లోని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించింది. వాళ్లలో ఎవరికైనా వైరస్ సోకింది, లేనిది వెల్లడి కావాల్సి ఉంది.
పైలట్కు వైరస్ ఎలా సోకింది?
వైరస్ విజృంభణతో ఇండియాతోపాటు ప్రపంచ దేశాలన్నీ ప్రయాణికుల విమాన సర్వీసుల్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. అత్యవసర కార్గో విమానాల్ని మాత్రమే నడుపుతున్నారు. చైనా, రష్యాలాంటి ఒకటి రెండు దేశాల్లో మాత్రం సర్వీసులు యధాతంధంగా నడుస్తున్నట్లు సమాచారం. కాగా, భారత్ కు చెందిన ప్రఖ్యాత స్పైస్జెట్ విమానయాన సంస్థ.. తమ పైలట్ ఒకరు కొవిడ్-19 వ్యాధికి గురయ్యాడని ప్రకటించింది. సదరు పైలట్ మార్చి నెలలో ఒక్క అంతర్జాతీయ సర్వీసు కూడా నడపలేదని, అయినాకూడా అతనికి వైరస్ ఎలా సోకి ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నామని సంస్థ పేర్కొంది. ఢిల్లీ, ముంబై నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వలస కూలీల కోసం విమానం సర్వీసులు నడుపుతామన్న స్పైస్ జెట్ ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.