ఎన్సీపీకి షాక్: బీజేపీలో చేరిన బీడ్ అభ్యర్థి నమిత..
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న కొద్దీ సీట్ల కేటాయింపులో పార్టీలు, ఓటేయాలని అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. మరోవైపు కొందరు పార్టీ మారుస్తున్నారు. ఇవాళ ఎన్సీపీ నేత నమిత అధికార బీజేపీలో చేరారు. నమిత ఇచ్చిన షాక్తో ఎన్సీపీ నేతలు ఖంగుతిన్నారు. అభ్యర్థికి సీటు కేటాయించిన తర్వాత ఇతర పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నమిత ఎన్సీపీలో ముఖ్య నేత. ఆమె ఇదివరకు కైజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేశారు. కానీ అక్కడినుంచి పోటీ చేసి ఓడిపోవడంతో ఈ సారి సీటును హైకమాండ్ మార్చివేసింది. బీడ్ నుంచి బరిలోకి దిగాలని కోరారు. ఎన్సీపీ ప్రకటించిన జాబితాలో నమిత సీటును బీడ్కు కేటాయించారు. నియోజకవర్గ మార్పుపై కాసింత కోపం మీద నమిత ఉన్నారు. తాను కైజ్ నుంచే పోటీ చేయాలని భావించారు. కానీ ఎన్సీపీ హైకమాండ్ మాత్రం బీడ్ నుంచి బరిలోకి దిగాలని స్పష్టంచేయడంతో అలకబూనారు. ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో తన సీటు మార్చారని ధ్రువీకరించుకొని ఏకంగా పార్టీనే మారిపోయారు.
ఇవాళ మహారాష్ట్ర మంత్రి పంకజ్ ముండే, బీజేపీ లోక్సభ అభ్యర్థి ప్రీతం ముండే సమక్షంలో నమిత బీజేపీలో చేరారు. ఓ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పార్టీ మారడం కలకలం రేపుతుంది. నమిత అత్త విమలా ఎన్సీపీలో కీ రోల్ పోషించారు. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నమిత కైజ్ నుంచి పోటీచేశారు. కానీ బీజేపీ అభ్యర్థి సంగీత తొంబ్రే చేతిలో ఓడిపోయారు. దీంతో మరోసారి ఓటమి తప్పదనే అంచనాలతో ఎన్సీపీ చీఫ్ నమిత సీటును మారిస్తే.. ఆమె ఏకంగా పార్టీనే మార్చివేశారు.