లోక్ సభ ఎన్నికలపై శరద్ పవార్ కీలక నిర్ణయం! ఇప్పటికే ఇద్దరు ఉన్నారంటున్న సీనియర్ నేత
ముంబై: దేశ రాజకీయాల్లో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయ జీవితంతో ముడిపడి ఉన్న నిర్ణయం అది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని శరద్ పవార్ ప్రకటించారు. అనూహ్యంగా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మహారాష్ట్ర ప్రజలకు విస్మయానికి గురి చేసింది.
లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉంటానంటూ.. హఠాత్తుగా ఆయన చేసిన ప్రకటన వెనుక గల కారణాలను అన్వేషిస్తున్నారు అభిమానులు. తాను దూరంగా ఉన్నప్పటికీ.. క్రియాశీలకంగా వ్యవహరిస్తానని, తెర వెనుక ఉండి నడిపిస్తానని శరద్ పవార్ భరోసా ఇస్తున్నారు.
ధన, కనక, వస్తు, వాహన రూపేణా..! ఏపీలో ప్రలోభాల పర్వం మొదలు: భారీగా నగదు పట్టివేత
ఇప్పటికే ఇద్దరు ఉన్నారు.. మళ్లీ నాకెందుకు?
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బరిలో ఉంటారని శరద్ పవార్ చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున బారామతి నుంచి లోక్ సభకు ఎన్నికైన సుప్రియా సూలే.. శరద్ పవార్ కుమార్తెనే. అలాగే- మాధా స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న విజయ్ సింహ మోహితే పాటిల్ కూడా శరద్ పవార్ కుటుంబీకుడే. ఈ ఎన్నికల్లో కూడా వారిద్దరూ పోటీ చేస్తారని శరద్ పవార్ చెబుతున్నారు. ఇక తానెందుకని పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు. 14 సార్లు తాను లోక్ సభకు పోటీ చేశానని చెప్పారు.
1984 నుంచి బరిలో..
శరద్ పవార్ తొలిసారిగా 1984లో బారామతి సీటు నుంచి లోక్ సభకు పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపారు. మూడుసార్లు వేర్వేరు సందర్భాల్లో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1991లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 1991 ఉప ఎన్నిక సహా 1996, 1998, 1999, 2004 లోక్ సభ ఎన్నికల్లో బారామతి నుంచే వరుసగా విజయం సాధించారు. 2009లో ఆ స్థానాన్ని తన కుమార్తె సుప్రియా సూలేకు కేటాయించారు. 2009లో ఆయన మాధా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి, గెలుపొందారు. 2014లో విజయ సింహ మోహితేను బరిలో దింపి, గెలిపించుకున్నారు.
కాంగ్రెస్ కు మింగుడు పడని విషయమే..
వచ్చే లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక భాగస్వామి. ఆ పార్టీ అధినేతే ఎన్నికలకు దూరం అవుతుండటం కాంగ్రెస్ కు ఒకింత శరాఘాతమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శరద్ పవార్ ఎన్నికల బరిలో దిగితే.. దాని సానుకూల ప్రభావం మిగిలిన స్థానాలపై ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేసింది. ఆయన హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు మింగుడు పడట్లేదు.