అర్నాబ్ గోస్వామిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
ముంబై: అర్నాబ్ గోస్వామి చిక్కుల్లో పడ్డారు. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అహ్వాద్ పరువు నష్టం దావా వేశారు. అర్నాబ్తో పాటు టైమ్స్ నౌ పైన ఆయన చర్యలకు ఉపక్రమించారు.
ఆ ఛానల్లో ప్రసారమయ్యే న్యూ అవర్ చర్చా కార్యక్రమంలో తన పైన అనాగరికమైన పరుష పదజాలం ఉపయోగించారని, తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు.
మహారాష్ట్రలోని కల్వ - ముంబ్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జితేంద్ర అహ్వద్. ఆయన న్యాయవాది ప్రశాంత్ కే కదమ్ ఈ నోటీసులు పంపించారు. అక్టోబర్ 6 రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమైన చర్చను ప్రస్తావించారు.
ఖూన్ కీ దలాలీ అనే వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ లక్ష్మణ రేఖను దాటారనే అంశంపై చర్చ సాగిందని, ఈ సమయంలో జితేంద్ర పరువు ప్రతిష్టల పైన దాడి చేస్తూ గోస్వామి నిరాధారమైన, తీవ్ర పదజాలం ఉపయోగించారని పేర్కొన్నారు.
ఇది టైమ్స్ నౌ చానల్లో, దాని వెబ్ సైట్లోను వచ్చిందన్నారు. ఏడు రోజుల్లో దీనిపై బేషరతు క్షమాపణ చెప్పాలని లేదంటే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. జితేంద్ర అహ్వాద్ థానేలో ప్రముఖ వ్యక్తి అని, రెండు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారని నోటీసులో పేర్కొన్నారు.
అర్నాబ్ గోస్వామితో పాటు ఆ ఛానల్ బ్యూరో చీఫ్ మేఘా ప్రసాద్, సీఈవో అవినాశ్ కౌల్, టైమ్స్ గ్లోబల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ సీఈవో సునీల్ లల్లా, టైమ్స్ గ్లోబల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్లకు నోటీసులు పంపించారు. పీవోకే ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రయిక్ పైన జితేంద్ర మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు.