అబ్బే అలాంటిదేం లేదే..! కాంగ్రెస్ - ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్
ముంబై : కాంగ్రెస్ పార్టీలో ఎన్సీపీని విలీనం చేయనున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష హోదా కోసం రెండు పార్టీలను ఏకం చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతవారం కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, శరద్ పవార్ భేటీ కావడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూర్చాయి. ఈ క్రమంలో విలీనం అంశంపై ఎన్సీపీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు.
బీజేపీపై పోరాడానికి 52 మంది ఎంపీలు చాలు : రాహుల్
అన్నీ వదంతులే
కాంగ్రెస్లో ఎన్సీపీని విలీనం చేసే ప్రతిపాదన లేదని ఆ పార్టీ ఛీప్ శరద్ పవార్ స్పష్టం చేశారు. ఇవన్నీ కొందరు జర్నలిస్టులు సృష్టిస్తున్న వదంతులే తప్ప ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో పవార్ ఈ వివరణ ఇచ్చారు. ఎన్సీపీ తన అస్థిత్వాన్ని ఎన్నటికీ కోల్పోదని, యూపీఏలో భాగస్వామిగా ఉండటం ఇష్టంలేని కొందరు జర్నలిస్టులే విలీనం ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారని పవార్ స్పష్టంచేశారు.
ప్రతిపక్ష హోదా కోసం
లోక్సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పవార్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం కాస్తా విలీనం ఊహాగానాలకు తెరతీసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఘోర ఓటమి పాలయ్యాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కేవలం 52 సీట్లు గెల్చుకోగా.. ఎన్సీపీ కేవలం 5సీట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కే అవకాశంలేకుండా పోయింది. దీంతో అవసరమైన సంఖ్యాబలం కోసం కాంగ్రెస్లో ఎన్సీపీ విలీనం అవుతుందన్న వార్తలు వచ్చాయి.
సగం సీట్లలో పోటీ
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ -ఎన్సీపీలు కలిసి పోటీ చేయనున్నట్లు పవార్ సంకేతాలిచ్చారు. ఈసారి ఎన్నికల్లో 50 శాతం సీట్లలో తమ అభ్యర్థుల్ని నిలబెట్టనున్నట్లు చెప్పారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుదిరిన పొత్తులో భాగంగా కాంగ్రెస్ 174, ఎన్సీపీ 114 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే 2014లో మాత్రం రెండు పార్టీలు వేర్వేరుగా బరిలో దిగాయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం తాము కలిసి పోటీ చేసినా.. 144 సీట్లు ఎన్సీపీకి కేటాయించాల్సిందేనని కాంగ్రెస్ను డిమాండ్ చేస్తామని పవార్ స్పష్టం చేశారు.