మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్!
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అజిత్ పవార్ మరోసారి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని చేపట్టే అవకాశాలున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మహా వికాస్ అఘాడీ కూటమి తరపున శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
భారీ ఊరట: ఇరిగేషన్ స్కాంలో అజిత్ పవార్కు క్లీన్చిట్
అయితే, అంతకుముందు అజిత్ పవార్ బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తన వద్ద ఎమ్మెల్యేలున్నారంటూ బీజేపీకి మద్దతు తెలిపి ఆ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని పొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటైంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మంత్రి పదవులను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్కు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తర్వాత ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలంటూ ఇప్పటికే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ పార్టీలో కూడా అంతా సానుకూలంగా ఉండటంతో అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లేనని తెలుస్తోంది. త్వరలోనే అజిత్ పవార్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.