ప్రతీ 15 నిమిషాలకో మానభంగం.. పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కని బాధితురాళ్లు.. కారణం అదే
దేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటన యావత్ దేశాన్ని ఎంతలా కదిలించిందో అందరికీ తెలిసిందే. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానం నిందితులకు ఉరిశిక్ష విధించింది. అయితే శిక్ష అమలులో మాత్రం జాప్యం జరుగుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఈ నెల 22వ తేదీన నిందితులకు ఉరిశిక్ష అమలుచేయబోతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే.. దేశం మొత్తాన్ని కదిలించిన ఈ ఘటన తర్వాత కూడా మహిళలపై అనేక అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ప్రతీ 15 నిమిషాలకు ఓ మహిళపై అత్యాచారం జరుగుతోందని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెబుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సగటున ప్రతీ 15 నిమిషాలకు
నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 2018లో సగటున ప్రతీ 15 నిమిషాలకు ఒక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. దాదాపు 34వేల మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఇందులో 85శాతం ఘటనలపై కేసులు నమోదు కాగా.. 27శాతం ఘటనల్లో మాత్రమే దోషులను గుర్తించారు. దీనిపై మహిళ సంఘాలు స్పందిస్తూ.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను పోలీసులు సీరియస్గా తీసుకోవట్లేదని,దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
లలితా కుమారమంగళం అభిప్రాయం..
'ఈ దేశం ఇప్పటికీ పురుషుల సారథ్యంలోనే నడుస్తోంది. ఒక్క ఇందిరాగాంధీ దేశ ప్రధానికి అయినంత మాత్రాన పరిస్థితిలో మార్పేమీ రాదు. ఇప్పటికీ చాలామంది న్యాయమూర్తులు కూడా పురుషులే.' అని బీజేపీ నేత, మాజీ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ లలితా కుమారమంగళం అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ దేశంలో తగిన సంఖ్యలో ఫోరెన్సిక్ ల్యాబ్స్ లేవని,ఫాస్ట్ ట్రాక్కర్టుల్లోనూ న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో సత్వర పరిష్కారం సాధ్యమేనా?
బెంగళూరులోని సెంటర్ ఫర్ లా&రీసెర్చ్ 2015 అధ్యయనం ప్రకారం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కేసుల్లో సత్వర విచారణ సాధ్యమే కానీ.. ఎక్కువ సంఖ్యలో కేసులను అవి పరిష్కరించలేవు. న్యూఢిల్లీలోని పార్ట్నర్స్ ఫర్ లా డెవలప్మెంట్ 2016 అధ్యయనం ప్రకారం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేసుల పరిష్కారానికి నిర్దేశించిన గడువు కంటే నాలుగు రెట్లు ఎక్కువ సమయం పడుతోంది. సగటున ఒక్కో కేసు విచారణ పూర్తి కావడానికి దాదాపు ఎనిమిదిన్నర నెలల సమయం పడుతోంది.
బయటకు రానివెన్నో..
అధికార లెక్కలు చెబుతున్న డేటా కంటే దేశంలో జరుగుతున్న అత్యాచారాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చు. పరువు,ప్రతిష్టల పేరుతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కని అత్యాచార బాధితురాళ్లు చాలామందే ఉంటారు. సమాజం తమను చిన్న చూపు చూస్తుందనో,నలుగురిలో చులకనైపోతామనో.. ఇప్పటికీ అనేకమంది బాధితులు అత్యాచార కేసులపై ఫిర్యాదుకు వెనుకాడుతున్నారు. కొన్ని కేసుల్లో బాధితులు అత్యాచారం,హత్యలకు గురైతే.. వాటిని కేవలం హత్య కేసులు గానే పరిగణిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.