క్షీణించిన ఎన్డీ తివారీ ఆరోగ్యం: పరిస్థితి విషమించిందన్న వైద్యులు..
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ (92) ఆరోగ్యం క్షీణించింది
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ (92) ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత అక్టోబర్ 26 నుంచి ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టు వైద్యులు తెలిపారు. జ్వరం, న్యూమోనియా కారణంగా ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం తివారీ రక్తపోటు పడిపోయిందని, ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు.
మాక్స్ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం ఆయన్ను 24గం. పర్యవేక్షిస్తోంది. సెప్టెంబర్ లో తివారీ బ్రెయిన్ స్ట్రోక్కు గురైనప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది.
కాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా తివారీ రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ గా సేవలందించిన ఆయన.. ఆ సమయంలో రాజ్ భవన్ లో ఆయన సాగిస్తున్న రాసలీలపై ఓ టీవీ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ చేపట్టడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.