రైతు నిరసనలు : ఎన్డీఏకి మరో షాక్ తప్పదా.. తప్పుకుంటామని హెచ్చరించిన ఆర్ఎల్పీ..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తొలి నుంచి రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఈ చట్టాలతో రైతులకు ఆర్థికంగా చాలా మేలు జరుగుతుందని కేంద్రం చెప్తుండగా... చిన్న,సన్నకారు రైతులు చితికిపోతారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ లేకుండా రైతులను పూర్తిగా ప్రైవేట్ వ్యాపారుల దయా దాక్షిణ్యాలకు వదిలేస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఈ చట్టాలపై నిరసన తెలియజేస్తూ ఇప్పటికే శిరోమణి అకాళీదళ్ పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకుంది. పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా మహా పోరాటానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరి మారకుంటే... తాము కూడా ఎన్డీయే నుంచి తప్పుకుంటామని తాజాగా రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) ప్రకటించింది.
Recommended Video
ఆర్ఎల్పీ చీఫ్ ఏమన్నారు...
రాజస్తాన్ ఎంపీ,ఆర్ఎల్పీ అధినేత హనుమాన్ బెనివాల్... కేంద్రం ఈ మూడు చట్టాలను రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. డిసెంబర్ 3 వరకూ వేచి చూడకుండా రైతులతో తక్షణం చర్చలు జరపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని వెంటనే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హనుమాన్ బెనివాల్ ట్వీట్ చేశారు.
ఎన్డీఏ నుంచి తప్పుకుంటాం..?
'ఆర్ఎల్పీ ఎన్డీఏ భాగస్వామి. కానీ ఆ పార్టీకి అధికారం ఇచ్చింది రైతులు,జవాన్లు. కాబట్టి రైతుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే.. ఎన్డీఏలో కొనసాగడంపై మేము పునరాలోచించుకోవాల్సి ఉంటుంది.' అని హనుమాన్ బెనివాల్ స్పష్టం చేశారు. గత వారం కూడా రైతుల విషయంలో తమ నిర్ణయాన్ని హనుమాన్ బెనివాల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రైతుల పట్ల కేంద్రం అణచివేత ధోరణిని ప్రదర్శిస్తే... దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా తాము కూడా నిరసనలకు దిగాల్సి వస్తుందన్నారు. రాజస్తాన్ రైతులతో కలిసి ఢిల్లీలో తాము కూడా నిరసనలు చేపడుతామన్నారు.
ఇంటా బయటా విమర్శలు...
కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో ఇంటా,బయటా కేంద్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి తప్పుకోగా ఆర్ఎల్పీ కూడా అదే బాటలో వెళ్లే అవకాశం ఉండటం చర్చనీయాంశంగా మారింది. గత ఐదు రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచాయి. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఇప్పటికే ఎన్డీయేపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ 3నే రైతులతో చర్చలంటూ కేంద్రం మొండికేయడం ఎన్డీయే ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు, నిరసన ప్రదేశాలనే పోలీసులు జైళ్లలా మార్చివేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం వాదన వేరే...
కేంద్రం ఎలాంటి షరతులు విధించకుండా చర్చలకు ముందుకు రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ మాత్రం.. రైతులకు లబ్ది చేకూర్చేందుకే చట్టాల్లో మార్పులు చేశామని పేర్కొనడం గమనార్హం.కొత్త చట్టాలతో రైతులకు న్యాయపరమైన భద్రత కూడా లభివస్తుందన్నారు. ఉత్తమ ధరకు పంటను విక్రయించుకునే అవకాశం వారికి దొరుకుతుందన్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.