అవిశ్వాసం: యుపిఎ ప్రభుత్వ రికార్డును బద్దలు కొట్టిన ఎన్డీఎ
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చను నిరాకరించడంలో గత యుపిఎ ప్రభుత్వం రికార్డును ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వం బద్దలు కొట్టింది. అవిశ్వాసం నోటీసుపై చర్చను అతి ఎక్కువ సార్లు నిరాకరించిన చరిత్రను ఎన్డీఎ ప్రభుత్వం మూటగట్టుకుంది.
బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాసానికి బుధవారం ఇచ్చిన నోటీసులతో కలిపి ఎనిమిది సార్లు నోటీసులు ఇచ్చాయి. సభ ఆర్డర్లో లేనందున వాటిని చేపట్టలేకపోతున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు.
యుపిఎ ప్రభుత్వ హయాంలో కాంగ్రెసు సభ్యులే తమ సొంత ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు నోటీసులు ఇచ్చారు.
సీమాంధ్రకు చెందిన అప్పటి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, సాయి ప్రతాప్, సబ్బం హరి, జీవీ హర్షకుమార్ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆ ఆరుగురు ఎంపీలను కాంగ్రెసు బహిష్కరించింది. తొలి నోటీసు వాళ్లు 2013 డిసెంబర్ 9వ తేదీన ఇచ్చారు. బహిష్కరణకుు గురైన తర్వాత 2013 డిసెంబర్ 18వ తేదీ వరకు ప్రతిరోజూ నోటీసులు ఇచ్చారు.
వారి నోటీసులను అప్పటి స్పీకర్ మీరా కుమార్ చర్చకు తీసుకోలేదు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను సుమిత్రా మహాజన్ చర్చకు తీసుకోవడం లేదు. ప్రతిపక్షాలు ప్రతి రోజూ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తూనే ఉన్నాయి.
యుపిఎ ప్రభుత్వ హయాంలోని మరో రికార్డును కూడా ఎన్డీఎ ప్రభుత్వం బద్దలు కొట్టబోతోంది. బహిష్కరణకు గురైన అప్పటి కాంగ్రెసు ఎంపీలు మోరాసి 2104 ఫిబ్రవరి వరుసగా 9 రోజులు నోటీసులు ఇచ్చారు. అన్ని పనిదినాల్లో ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు నోటీసులు ఇచ్చారు. సోమవారం కూడా సుమిత్రా మహాజన్ అవిశ్వాసంపై నోటీసులను చర్చకు తీసుకోకపోతే ఈ రికార్డు కూడా బద్దలవుతుంది.