రాహుల్ గాంధీకి బీజేపీ చెక్..! అక్కడ పోటీలో ఎవరో తెలుసా?
ఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ చెక్ పెట్టింది. అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ కు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అమిత్ షా గట్టి షాకిచ్చారు. తొలిసారిగా దక్షిణాది కదనరంగంలో నిలిచిన రాహుల్ గాంధీకి వయనాడ్ లో కలిసొచ్చే అంశాలు బాగానే ఉన్నాయి. అయితే ఆచితూచి వ్యవహరించిన కమల రథసారధి రాహుల్ గాంధీకి సరితూగే లీడర్ ను ఎంపిక చేశారు.
పెద్దపల్లి ఎన్నికలు..! ఎటువైపు ఓటర్లు?
బీజేపీ స్కెచ్.. తుషార్ కు టికెట్
రాహుల్ గాంధీపై పోటీ అంటే మామూలు విషయం కాదు. అందుకే అమిత్ షా పెద్ద స్కెచ్ వేశారు. వయనాడ్ లో ఆయనకు అపొజిట్ గా తుషార్ వెల్లప్పల్లిని ప్రకటించారు. ఈయన బీజేపీకి మిత్రపక్షమైన భారత్ ధర్మ జనసేన పార్టీకి చెందిన లీడర్. అంతేకాదు ఎన్డీయే కన్వీనర్ గా కొనసాగుతున్నారు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగమ్ ప్రధానకార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్ కుమారుడే ఈ తుషార్. కేరళలో వెనుకబడిన కులమైన ఈళవల సంక్షేమానికి కృషి చేస్తున్న వ్యక్తుల్లో వెల్లప్పల్లి నటేశన్ ఒకరు. రాష్ట్ర జనాభాలో వీరి కులం 22 శాతంగా ఉండటం తుషార్ వెల్లప్పల్లికి బాగా కలిసొచ్చే అంశం.
తుషార్.. డైనమిక్ లీడర్..!
భారత్ ధర్మ జనసేన (BDJS) నేత తుషార్ వెల్లప్పల్లిని వయనాడ్ నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దించామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఆయన డైనమిక్ లీడరని.. బీజేపీ నినాదాలైన సామాజిక న్యాయం, అభివృద్ధి తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆయన కీ రోల్ పోషిస్తారు. కేరళ రాజకీయాల్లో ఎన్డీయే అల్టర్నేటివ్ పవర్ గా అవతరించనుందంటూ ట్వీట్ చేశారు అమిత్ షా.
వయనాడ్ వయా త్రిస్సూరు
తొలుత త్రిస్సూరు సెగ్మెంట్ నుంచి ఆయనకు టికెట్ ఇవ్వాలని బీజేపీ అగ్రనేతలు భావించారు. అయితే అకస్మాత్తుగా రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి బరిలోకి దిగడంతో ప్లాన్ బీ అమలు చేశారు కమలనాథులు. అందుకే చివరిక్షణంలో తుషార్ ను వయనాడ్ నుంచి రంగంలోకి దించారు. రాహుల్ గాంధీకి ఆయన గట్టి పోటీ ఇస్తారనేది బీజేపీ హైకమాండ్ ఆలోచన. మొత్తానికి వయనాడ్ లో చేయి, కమలం తీరుగా సాగుతున్న పోరు ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి.