టార్గెట్ రాజ్యసభ... బీజేపీ నెక్స్ట్ ప్లాన్ అదేనా?
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు రాజ్యసభపై కన్నేసింది. పెద్దల సభలో బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. లోక్సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉన్నా.. రాజ్యసభలో సంఖ్యాబలం లేకపోవడంతో పలు కీలక బిల్లులు ఆమోదం పొందలేకపోతున్నాయి. కొత్త చట్టాలు, సవరణల బిల్లులకు రాజ్యసభలో గ్రీన్ సిగ్నల్ దొరకకపోవడం ఎన్డీయేకు అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో పెద్దల సభలో పట్టు పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు కదులుతోంది.
దీదీకి షాక్: మోడీ వ్యాఖ్యలు నిజమేనా... బీజేపీలోచేరేందుకు హస్తినకు టీఎంసీ ఎమ్మెల్యేలు
ఆరేళ్లకోసారి ఎన్నికలు
రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. అయితే పెద్దల సభలోని 250స్థానాలకు ఒకేసారి జరగవు. రెండేళ్లకోసారి చొప్పున విడతలవారీగా ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్రాల ఎమ్మెల్యేలు వీరిని ఎన్నుకుంటారు. అందుకే రాజ్యసభలో బలం పెరగాలంటే ముందుగా బీజేపీ వివిధ రాష్ట్రాల్లో పట్టు బిగించాల్సి ఉంటుంది.
బలం పెంచుకునే పనిలో బీజేపీ
రాజ్యసభలో మరో రెండేళ్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం భారీగా పెరిగే ఛాన్సుంది. ప్రస్తుతం బీజేపీ కూటమికి 99మంది ఎంపీలు ఉండగా.. ప్రతిపక్షానికి 65 మంది మద్దతుంది. 250 మంది సభ్యులున్న రాజ్యసభలో ఏ బిల్లైనా ఆమోదం పొందాలంటే 124 మంది బలం అవసరం. ఈ ఏడాది 10సీట్లు ఖాళీ కానుండగా.. 2020లో 72 స్థానాలకు ఎన్నిక జరగనుంది. వచ్చే ఏడాది యూపీలో 10 సీట్లకు ఎన్నిక జరగనుండగా.. బీజేపీ వాటిలో 9 తన ఖాతాలో వేసుకోవడం ఖాయం.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ముఖ్యం
రాజ్యసభలో మెజార్టీ పెంచుకునేందుకు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లే ముఖ్యం. వాటి ఆధారంగానే ఆయా పార్టీలు పెద్దల సభకు ఎంపీలను పంపే అవకాశముంది. ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం నమోదుచేస్తే రాజ్యసభలో బలం పెరుగుతుంది. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఎన్డీఏ తన మార్కు పాలన చూపించాలన్నా.. కొత్త సంస్కరణలకు తెర తీయాలన్నా.. రాజ్యసభలో మెజార్టీ అత్యవసరం. ఈ నేపథ్యంలో వీలైనన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డనుంది.
2021 నాటికి మేజిక్ ఫిగర్
ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సహకారంతో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటుతుంది. రానున్న రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు సత్తా చాటితే 2021 ఇది సాధ్యమవుతుంది. బీహార్లో జేడీయూ, తమిళనాడులో అన్నాడీఎంకే, మహారాష్ట్రలో శివసేనకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపై రాజ్యసభలో ఎన్డీఏ సంఖ్యా బలం ఆధారపడి ఉంది. ఒకవేళ అన్నీ కలిసొచ్చి పెద్దల సభలో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటితే కేంద్రంలో అధికార పార్టీ రాజ్యసభలోనూ మెజార్టీ సాధించిన పార్టీగా 15ఏళ్ల తర్వాత బీజేపీ రికార్డు సృష్టించనుంది.