ఎన్డీటీవీ: నిషేధం-ఎత్తివేత, అసలేం జరిగింది?
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ఇండియా(హిందీ) ఛానల్పై ఒకరోజు విధించిన నిషేధాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడం, ప్రసారాల నిలిపివేతపై ఎన్డీటీవీ పెట్టుకున్న అర్జీని మంగళవారం విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడంతో సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిషేధాన్ని నిలిపివేశారు.
ఈ ఏడాది జనవరిలో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రసారం చేసిందని ప్రభుత్వం నవంబర్ 9న ఛానల్ ప్రసారాలపై నిషేధం విధించింది. కాగా, అదే సమాచారాన్ని ఇతర ఛానళ్లూ ప్రసారం చేశాయని ఎన్డీటీవీ వాదిస్తోంది.
అయితే, నిబంధనలకు అతిక్రమించి రక్షణకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేసినందుకే నిషేధం విధించామని సోమవారం ఉదయం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు. నిషేధం విధించడం సమంజసమేనని ఆయన అన్నారు.
కాగా, సోమవారం సాయంత్రమే ఎన్డీటీవీపై సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వశాఖ ఎన్డీటీవీపై నిషేధం ఎత్తివేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో ఎన్డీటీవీ బ్యాన్ అంశంపై విస్తృత చర్చ జరిగింది. అయితే, ఎన్డీటీవీ సహ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, వెంకయ్యనాయుడులు అంతర్గత మంత్రిత్వశాఖ సమావేశంలో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఎన్డీటీవీ రక్షణకు సంబంధించిన అంశాలను ప్రసారం చేయడంపై మంత్రిత్వ శాఖ అసంతృప్తి చేసినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే నిషేధం విధించడంపై ఎన్డీటీవీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేదానిపై అంతటా ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే, దేశ రక్షణ విషయం కాబట్టి మీడియా సమన్వయం పాటించాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.