తొందరేంలేదు, 5న విచారిస్తాం: ఎన్డీటీవీ పిటిషన్పై సుప్రీం
న్యూఢిల్లీ: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ఇండియా ప్రసారాలను ఒక్క రోజు నిలిపివేయాలని కేంద్రం జారీ చేసిన నిషేధ ఉత్తర్వులకు సంబంధించిన అంశంపై డిసెంబరు 5న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం వెల్లడించింది.
పఠాన్కోట్ తీవ్రవాద దాడికి సంబంధించి కవరేజీ వ్యవహారంలో నవంబర్ 9న ఎన్డీటీవీ ప్రసారాలు నిలిపివేయాలంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసి తర్వాత ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే.
అయితే కేంద్రం తమ ఛానల్పై ఒక రోజు నిషేధం వేయడాన్ని సవాలు చేస్తూ ఎన్డీటీవీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను మంగళవారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు డిసెంబరు 5న దీనిపై విచారణ చేయనున్నట్లు తెలిపింది.
ఎన్డీటీవీ అంశం విచారణపై తొందరేమీ లేదని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇందుకు కోర్టుకు కూడా సానుకూలంగా స్పందించింది. డిసెంబర్ 5న విచారిస్తామని స్పష్టం చేసింది.