మావోయిస్టు అగ్రనేత గణపతి తలపై కోటి రూపాయలు
ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా బీర్బూమ్లో చోటుచేసుకున్న భూస్వాముల హత్యలు, పోలీసుల వధలకు సంబంధించిన కేసుల్లో గణపతి ప్రధాన నిందితుడు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఆయనపై అంత మొత్తం రివార్డు ప్రకటించింది. 2005లో మావోయిస్టు పార్టీ సారథ్యం తీసుకునే సమయానికి ఆయన తలపై అరకోటి రివార్డు ఉండేది. అల్ఖైదా, హిజ్బూల్, లష్కరే ఉగ్రవాదులతో సమానంగా.. గణపతిని పోల్చి ఈ మొతాన్ని కేంద్రం ఖరారు చేసింది.
ఇప్పుడు దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం ఆయన జాడ గురించి చిన్న క్లూ ఇచ్చినా ఆ మొత్తాన్ని ఇచ్చేస్తామని ప్రకటించింది. మావోయిస్టు పార్టీ విధాన మండళ్లు అయిన సెంట్రల్ కమిటీ, పొలిట్బ్యూరోలకు చెందిన నాయకుల ఆచూకీ తెలిపితే రూ.60 లక్షల రివార్డు అందిస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. గణపతి సహా మావోయిస్టు అగ్రనేతలందరిపైనా మహారాష్ట్రలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. పరారీలో ఉన్న నిందితులుగా వీరిని ప్రభుత్వం పరిగణిస్తూ ఉంటుంది.
ఈ మేరకు ఏటా ఈ నక్సలైట్ నేతల తలపై ఉన్న రివార్డులను సవరిస్తూ వస్తోంది. గణపతి బృందానికి ఉద్యమ స్థావరంగా భావిస్తున్న దండకారణ్యంలోకి మహారాష్ట్రలోని గడ్చిరోలి, సిరోంచ అటవీ ప్రాంతాల మీదుగా ప్రవేశించాల్సి ఉంటుంది. టీచర్గా పనిచేస్తున్న సమంయలో గణపతి 1977లో ఓ హత్య కేసులో అరెస్టును తప్పించుకోవడానికి దళాల్లో చేరినట్టు చెబుతారు. దాదాపు అరవై పడిలో పడిన ఈ నాయకులంతా ఇప్పుడు జార్ఖండ్, ఛత్తీసగఢ్, ఒడిశా ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.