కరోనా హాట్స్పాట్ మర్కజ్ మసీదు ఖాళీ: 2100 మంది క్వారంటైన్లకు: 150పైగా పాజిటివ్ కేసులతో కనెక్షన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోన్న న్యూఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు భవన సముదాయంలో చోటు చేసుకున్న సామూహిక మత ప్రార్థనల వ్యవహారం మరింత తీవ్రతరమైంది. మర్కజ్ మసీదు భవనాన్ని ఖాళీ చేయించిన తరువాత కూడా న్యూఢిల్లీలోని మసీదుల్లో వందలాది మంది ప్రార్థనలను కొనసాగిస్తున్నారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వారిని ఖాళీ చేయిస్తున్నారు.
ఇప్పటిదాకా ఢిల్లీలో మర్కజ్ భవనం సహా ఇతర మసీదులపైనా ఢిల్లీ పోలీసులు నిఘా పెట్టారు. అక్కడ ఉన్న వారిని క్వారంటైన్లకు తరలించారు. ఇలా మొత్తం 2,100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వైద్య పరీక్షల కోసం తరలించారు. రాత్రి నుంచీ ఈ తరలింపు కొనసాగుతున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలించామని, వారి రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీలకు పంపించినట్లు చెప్పారు. వాటి నివేదిక అందాల్సి ఉందని తెలిపారు.
ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 150కి పైగా వెలుగులోకి వచ్చిన కరోనా పాజిటివ్ కేసులతో మర్కజ్ మసీదు భవన సముదాయానికి కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జార్ఖండ్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన పాజిటివ్ కేసులు కూడా ఢిల్లీ మత ప్రార్థనలతో లింకు ఉన్నట్లు తేలింది. తొలిరోజు మర్కజ్ భనవం నుంచి అదుపులోకి తీసుకున్న వారిలో ఏకంగా 24 మంది కరోనా వైరస్ పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ మత ప్రార్థనల ఉదంతం ఒక్కసారిగా కలకలాన్ని రేపింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోవడానికి కారణమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముందుజాగ్రత్త చర్యలను చేపట్టాయి. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలను జరిపించుకోవాలని ఆదేశించాయి.