పంట పండింది: రైతుకు చిక్కిన రూ. 50 లక్షల విలువైన డైమండ్
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలోని ఓ గనిలో భారీ వజ్రం లభ్యమైంది. ఈ వజ్రం 10.69 క్యారెట్లు ఉండటం గమనార్హం. రాణిపూర్ ప్రాంతంలోని గనిని లీజుకు తీసుకున్న ఆనందిలాల్ కుశ్వాహా ఆ వజ్రాన్ని స్థానిక వజ్రాల కార్యాలయంలో జమ చేసినట్లు పన్నా వజ్రాల అధికారి పాండే తెలిపారు.
ఈ విలువైన వజ్రాన్ని వేలం వేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ రాయల్టీ, పన్నులను తగ్గించిన తర్వాత ఆదాయాన్ని డిపాజిటర్కు ఇస్తామని వెల్లడించారు. వజ్రం విలువను వెల కట్టాల్సి ఉందన్నారు. అయితే, వజ్రం నాణ్యత ఆధారంగా రూ. 50 లక్షల విలువ చేస్తుందని స్థానిక నిపుణులు చెబుతున్నారు.
కాగా, ఆనందిలాల్ ఇటీవలే 70 సెంట్ల వజ్రాన్ని కూడా కార్యాలయంలో జమ చేశారు. కరోనా లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇక్కడ లభ్యమైన మొదటి పెద్ద వజ్రం ఇదేనని ఆనందిలాల్ కుశ్వాహా తెలిపారు. తనతోపాటు తన భాగస్వామి ఆరు నెలలుగా గనిలో చాలా కష్టపడుతున్నామని, అయితే, వజ్రం తనను ఎంతో ఆనందానికి గురిచేసిందన్నారు.
Recommended Video
పన్నా డైమండ్ రిజర్వ్ ఏరియాలో స్థానిక రైతులకు ప్రభుత్వం లీజుకు ఇస్తోంది. గనుల్లో బయటపడిన విలువైన వజ్రాలు, రాళ్లను రైతులు తిరిగి సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు అందజేస్తారు. ఇందుకు కొంత ప్రభుత్వ అధికారులు తగిన మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు. మధ్యప్రదేశ్ బుంధేల్ ఖండ్ ప్రాంతంలోని పన్నా జిల్లాలో అనేక వజ్రాలు బయటపడుతున్నాయి.